గ్యాస్ సిలిండర్కు ఓ దండం: ఓటేసిన కేటీఆర్: తొలి గంటలోనే..జోరుగా పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. తొలి గంటలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి నిల్చున్నారు. క్రమంగా ఓటర్ల తాకిడి పెరుగుతోంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తొలి మూడు గంటల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు. పోల్ అయ్యే ఓట్ల శాతం ఎలా ఉండొచ్చనేది తొలి మూడు గంటల్లో తేలిపోతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పోలింగ్ పర్సంటేజీ తక్కువగా నమోదయ్యే అవకాశం లేదనే చెబుతున్నారు.
తొలి గంటలోనే ఓటు
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తొలి గంటలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన ఓటు వేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందే బూత్ వద్దకు చేరుకున్న ఆయన.. అక్కడే కొద్దిసేపు వేచి చూశారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వరుసలో తన కంటే ముందున్న వారికి అవకాశం ఇచ్చారు. అనంతరం తాను ఓటు వేశారు.
పోలింగ్ పర్సంటేజ్ పెంచాలి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలనేవి అతిపెద్ద పండుగగా భావిస్తారని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యులు కావాలని విజ్ఙప్తి చేశారు. ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టభద్రులు ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తాను ఓటు వేశానని అన్నారు. పోలింగ్ కేంద్రానికి బయలుదేరి రావడానికి ముందు గ్యాస్ సిలిండర్కు నమస్కారం పెట్టొచ్చానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందరికీ మంచి చేయగల అభ్యర్థికి ఓటు వేశానని చెప్పారు. గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 39 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందని, ఈ సారి దాన్ని బ్రేక్ చేయాలని అన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా..
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్ర నియోజకవర్గాలకు నిర్వహిస్తోన్న ఈ ఎన్నికలు.. టీఆర్ఎస్కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీకి కోల్పోవడం, తదనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్యంగా గట్టిపోటీని ఎదుర్కొనడం వంటి పరిణామాల మధ్య ఈ రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి తీరాల్సిన పరిస్థితిలో పడింది టీఆర్ఎస్. వరుసగా ఎదుర్కొన్న రెండు ఎన్నికల్లో చేదు అనుభవాలను చవి చూసిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
బరిలో టాప్ లీడర్స్..
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కుమార్తె వాణి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు, కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి జీ చిన్నారెడ్డి పోటీలో ఉన్నారు. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలంగాణ జన సమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ వంటి హేమాహేమీలు ఈ ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఫలితంగా- ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.