దుబ్బాకలో విజయం ఎవరిది? ఆరా పోల్ సర్వే ఏం చెబుతోంది? అనూహ్య ఫలితాలు ఉంటాయా?
హైదరాబాద్: తెలంగాణ సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ ఉప ఎన్నిక గుణపాఠంలా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పరాభవం తప్పదనే అంచనాలు ఉన్నాయి. టీఆర్ఎస్ విజయం సాధించినా.. మెజారిటీ భారీగా తగ్గొచ్చని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయ పడ్డాయి. పోల్ సర్వేల ప్రకారం.. దుబ్బాక ఉప ఎన్నికపై మిశ్రమ అంచనాలు వెలువడ్డాయి.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆరా పోల్ సర్వే వెల్లడించింది. ఆ పార్టీ అభ్యర్థిని సోలిపేట సుజాతకు 48.72 శాత మేర ఓట్లు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికార పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ.. మెజారిటీని భారీగా కోల్పోతుందని పేర్కొంది. భారతీయ జనతా పార్టీ రెండోస్థానంలో నిలుస్తుందని తెలిపింది. బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావుకు 44.64 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని అభిప్రాయపడింది. కాంగ్రెస్కు మూడో స్థానం తప్పదని, ఆ పార్టీకి 6.12 శాతం మాత్రమే ఓట్లు పోల్ అవుతాయని పోల్ సర్వేలో వెల్లడించింది.
ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీ ఏకపక్షంగా విజయం సాధించే పరిస్థితులు ఉంటాయని, దీనికి భిన్నంగా హోరాహోరి పోరు నెలకొన్నట్లు పేర్కొంది. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ మాజీ నేత చెరకు శ్రీనివాస రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. తనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్నప్పటికీ.. దాన్ని నిలుపుకోలేకపోవచ్చనే విషయాన్ని ఆరా పోల్ సర్వే స్పష్టం చేసినట్టయింది. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్.. దీనికి భిన్నంగా ఉంది. ఈ ఎన్నికలో బీజేపీ ఘన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేసినట్లు పేర్కొంది.
రఘునందన్ రావుకు భారీ మెజారిటీ లభిస్తుందని స్పష్టం చేసింది. బీజేపీకి 51.82 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని అంచనా వేసినట్లు తెలిపింది. టీఆర్ఎస్ రెండోస్థానంలో నిలుస్తుందని, ఆ పార్టీకి 35.67 శాతం ఓట్ల లభిస్తాయని పేర్కొంది. కాంగ్రెస్కు 12.15 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్లో అభిప్రాయపడింది. టీఆర్ఎస్కు సానుభూతి పవనాలు కూడా పనిచేయకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. గెలిచినా ఆ పార్టీకి లభించే మెజారిటీ నామమాత్రంగా ఉండొచ్చని చెబుతున్నాయి.