కీలక నేతకు దీర్షకాలిక వ్యాధి, ఆయనెందుకు ఆత్మహత్య చేసుకోలేదు: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటంబాలకు ఆర్ధిక సాయం అందివ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మను తెలంగాణ టిడిపి ప్రతినిధి బృందం రేవంత్రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందించింది.
దీర్ఘకాలిక వ్యాధి వల్లనే రైతు లింబయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. అదే నిజంగా కారణమైతే తెలంగాణ ప్రభుత్వంలో ఓ కీలక నేత కూడా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నరని, ఆ నేత ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కూడా రెండు నెలల పాటు ఆస్పత్రిలో ఉన్నారని చెబుతూ మరి ఆయనెందుకు ఆత్మహత్య చేసుకోలేదని రేవంత్ అడిగారు.
హరీష్ రావు, కెటిఆర్ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతూ మానసికంగా బాధపడుతున్నారని అంటూ వారెందుకు ఆత్మహత్య చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలపై ప్రభుత్వం సంపూర్ణ సమాచారం సేకరించాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కరువు మండలాలలను ఆదుకోవాలని ఆయన కోరారు.

ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నివేదిక పంపడం లేదన్నారు. అలాగే లింబయ్య అనే రైతు మృతిపై ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు.
దీర్ఘకాలిక రోగాలుంటే ఆత్మహత్యలు చేసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
రైతులకు రుణమాఫీ కాలేదని టిడిపి శాసనసభ్యులు చెప్పారు. రైతుల ఆత్మహత్యలను హేళన చేయవద్దని వారు విజ్జప్తి చేశారు. రైతులకు రుణమాఫీ కాలేదని, టోల్ ఫ్రీ కూడా పనిచేయడం లేదని వారు చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై టిడిపి పోరుకు సిద్ధమవుతోంది.
లింబయ్య మృతిపై తప్పుడు నివేదిక ఇచ్చారని వారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలేసి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారు కోరారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ సక్రమంగా అమలు కావడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. శుక్రవారం తెలంగాణ టిడిపి నాయకులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశమయ్యారు. రైతుల ఆత్మహత్యలు, ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పు, తదతిర అంశాలపై వారు చర్చించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వకుండా తిప్పి పంపిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీని వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయని చెప్పారు. రైతు రుణాలను ఒకే దఫాలోమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications