బీసీ రిజర్వేషన్ల కోసం సైనికుల్లా పని చేశాం
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య అధ్యక్షతన బెంగళూరులో జరిగిన ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశంలో ఆయన ప్రసంగించారు. "మనమెంతో మనకాంత" అన్న నినాదాన్ని సమగ్రంగా అమలు చేసేందుకు రాహుల్ గాంధీ కన్న కలలైన బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుందని ఆయన వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో తాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీ డిక్లరేషన్ను ప్రతిపాదించానని గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రవర్ణానికి చెందినవారైనప్పటికీ, బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ సహకారం అందించి, న్యాయ, చట్ట, రాజకీయ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమలు చేసేందుకు కృషి చేశారని గౌడ్ ప్రశంసించారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బీసీ రోస్టర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కమిషన్, బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు, కులగణన, అసెంబ్లీలో బిల్లు, గవర్నర్కు ఆర్డినెన్స్ వంటి అన్ని చర్యలు తీసుకుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విప్లవాత్మక చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అక్టోబరులో ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించనున్నామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications