మళ్లీ సీఎంల కలయిక: తొలుత బాబుని పట్టించుకోక, ఆనక నవ్వుతూ చేయిచ్చిన జగన్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (తెలంగాణ), నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్)లు మరోసారి కలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు చేతులు కలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమానికి ఇరువురు ముఖ్యమంత్రులు హాజరై ఉల్లాసంగా గడిపారు.
గవర్నర్ నివాసంలో సాయంత్రం ఎట్ ఏ హోం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరువురు సీఎంలతో, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్, తెలంగాణ స్పీకర్ మధుసూదనా చారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు. చంద్రబాబు, కేసీఆర్లతో జగన్ నవ్వుతూ కరచాలనం చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ఇది మూన్ డే అన్నారు. ఎట్ హోంకు ఇద్దరు చంద్రులు వచ్చారన్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండాలని జగన్ను గవర్నర్ కోరారు. రిషికేష్ పర్యటన వివరాలను గవర్నర్ సతీమణి విమల అడిగి తెలుసుకున్నారు. కాగా, చంద్రబాబు కంటే ముందే జగన్ ఎట్ హోం నుంచి వెళ్లారు. కాగా, కేసీఆర్, గవర్నర్ కాసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తొలుత బాబును పలకరించని జగన్
తొలుత చంద్రబాబును జగన్ పలకరించలేదని తెలుస్తోంది. తనకు కేసీఆర్ ఎదురుపడగా అభివాదం చేశారు. ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబుతో మాట్లాడకుండా ముందుకు పోయారని తెలుస్తోంది. అయితే మండలి చైర్మన్ చక్రపాణి కలుగజేసుకొని.. అది సరైన పద్ధతి కాదని చెప్పి, చంద్రబాబు వద్దకు తీసుకెళ్లగా నవ్వుతూ పలకరించారని తెలుస్తోంది.
చంద్రబాబు ఇలా వచ్చి అలా వెళ్తారు!
ఏపీ సీఎం చంద్రబాబు ఎట్ ఏ హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత వెంటనే విజయవాడకు వెళ్తారు. ఆయన ఇబ్రహీంపట్నంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది.