'తెలుగు రాష్ట్రాలు శత్రువుల్లా ఉండొద్దు, రాబోయే రోజుల్లో పెనుమార్పులు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు శత్రువుల్లా ఉండకూడదని, ప్రజల మధ్య వైరుధ్యాలు ఏర్పడటం ఏమాత్రం మంచిది కాదని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర రావు శనివారం నాడు అన్నారు.
రాబోయే రోజుల్లో దక్షిణాది రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పారు. తమిళనాడు, కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ మార్పులు కనిపిస్తాయని చెప్పారు. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో శనివారం భారతీయ విద్యా భవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద రాజకీయాలు-ఆకాంక్షలు-సవాళ్లు అంశంపై సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాంతీయ భవిష్యత్తు గురించి మాత్రే ఆలోచించే సంకుచిత్వంతో ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలు విశాల దృక్పథంతో ఆలోచిస్తే రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముందన్నారు.
ప్రజలు తమ రాష్ట్రాల విస్తృత అభివృద్ధి, ప్రయోజనాలు సాధించాలనుకుంటే జాతీయ భావ పార్టీలను కూడా ఆదరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కులం మతం, వర్గం అంటూ ఓటు రాజకీయాలు చేస్తోందని, అందుకే సమాధి అయిందన్నారు.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు శత్రువుల్లా ఉండవద్దని, ప్రజల మధ్య వైరుధ్యాలు సరికాదన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల కంటే, యాకూబ్ మెమెన్ విషయంలో కొన్ని పార్టీల నేతల హడావుడి టీవీల్లో ఎక్కువగా కనిపించిందన్నారు.
అలాంటి పార్టీలతో కొందరు పొత్తులు కుదుర్చుకోవడం చూస్తుంటే పరిస్థితులు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. హిందువులను ఉరితీస్తే ఒక్కరు మాట్లాడలేదని కానీ, ఉగ్రవాదులను ఉరితీస్తామంటే లౌకికవాదం అంటున్నారని ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి అన్నారు.