కొత్తగూడెంలో 46.8, గన్నవరంలో 47.4: తెలుగురాష్ట్రాల్లో ఠారెత్తిస్తోన్న ఎండలు, వడగాలులు కూడా..
తెలుగురాష్ట్రాల్లో హై టెంపరేచర్ నమోదవుతోంది. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. కరోనా వైరస్ వల్ల ఇంటిపట్టునే ఉంటోన్న.. వేడిగాలులకు జనం మాడిపోతున్నారు. తేమ తగ్గిపోవడంతో.. కాసేపటికే నోరు ఆరిపోతోంది. దీంతో మజ్జిగ, నిమ్మకాయ రసం తాగి సేదతీరుతున్నారు. లాక్ డౌన్ 4.0లో సడలింపులు ఇచ్చినా.. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకొచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.
రాష్ట్రంలో ఒకవైపు ఎండ...ఇంకోవైపు వర్షం:అదే విచిత్ర వాతావరణం
కొత్తగూడెంలో 46.8
తెలంగాణ రాష్ట్రంలో గత రెండురోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శుక్రవారం భద్రాద్రి-కొత్తగూడెంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇదే రికార్డు ఉష్ణోగ్రత. నల్లగొండ, పెద్దపల్లిలో 46.7 డిగ్రీలు, జగిత్యాలలో 46.5, ఖమ్మంలో 46.6, నిర్మల్లో 46.3, మంచిర్యాల, ఆదిలాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, సూర్యాపేటలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్ తప్ప రాష్ట్రవ్యాప్తంగా 45.9 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. శుక్రవారం భాగ్యనగరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే మూడురోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం వరంగల్ అర్బన్, రూరల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మూడురోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.
గన్నవరంలో 47.4
ఇటు ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరులో శుక్రవారం 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులో వడగాలులు వీచాయి. శని, ఆదివారాల్లో కూడా ఎండ తీవ్రతతోపాటు వడగాలులు కొనసాగతాయని వాతావరణశాఖ చెబుతోంది. శనివారం విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు , ప్రకాశం, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి-48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. విజయనగరం ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 43-45 డిగ్రీలు, శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం విజయనగరం , విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో 44 నుంచి 46 వరకు.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో42 నుంచి 43 వరకు... శ్రీకాకుళం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 39 నుంచి 42 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఏపీలో మరో ఆరురోజులు పరిస్తితి ఇలానే ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Recommended Video
వడగాలులతో జాగ్రత్త..
కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో వడగాల్పులు ఎక్కువగా వీస్తాయని.. ప్రజలు ఇళ్లలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి మజ్జిగ, నిమ్మకాయ రసం, కొబ్బరి నీరు తీసుకోవాలని కోరుతున్నారు.