హరీశ్ రావు వల్లే కేంద్రం ముందు తలెత్తుకోలేని పరిస్థితి: జల వివాదంపై రఘునందన్ రావు ఫైర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఫైరయ్యారు బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ఏడేళ్లుగా టీఆర్ఎస్ మాట్లాడకుండా మౌనంగా ఉందని ధ్వజమెత్తారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణ, గోదావరి నదీ జలాల బోర్డుల నోటిఫికేషన్ జరిగిందన్నారు.

తెలుగు రాష్ట్రాల లేఖలతోనే కేంద్రం నోటిఫికేషన్
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ఎద్దడి వివాదాలు పెరగకుండా కేంద్రం.. కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయడం ఉపయోగపడుతుందని రఘునందన్ రావు చెప్పారు. దీన్ని నీటి కేటాయింపుల విషయంగా చూడకూడదన్నారు. ఇప్పటికే కేటాయించిన నీటిని బోర్డుల ద్వారా జరిగే నిర్వహణగా చూడాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి, అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని పరస్పరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాసిన నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆ పరిస్థితి రాకూడదనే కేంద్రం జోక్యం
రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం, వివాదాలు పెద్దవి చేయకూడదనే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని రఘునందన్ రావు వివరించారు. నదీ జలాల విషయాన్ని తెలంగాణ రాజకీయం చేయానుకుంటుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలపై మాట్లాడకుండా ఇప్పటి వరకు సర్కారు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా తాము స్వాగతిస్తామని రఘునందన్ రావు తెలిపారు.

హరీశ్ రావు వల్లే కేంద్రాన్ని అడిగేందుకు ముఖం చెల్లడం లేదు..
2015లో కృష్ణా జదీ జలాల వాటాను ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం కింద హరీశ్ రావు ఒప్పుకున్నారని, అందుకే ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదని రఘునందన్ రావు విమర్శించారు. నీటి విషయంలో తెలంగాణ బీజేపీని బద్నాం చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు, సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ముందుకు వచ్చి తమ వాదాన్ని కేసీఆర్ ప్రభుత్వం వినిపించాలన్నారు. ఇప్పటి వరకు జల వివాదాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత మాటమార్చి సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications