ఎపికి తెలంగాణ మరో షాక్: ఆంధ్రలోని విద్యాపీఠాల ఎత్తివేత
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ ఇచ్చిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూచిపూడి, రాజమండ్రి, శ్రీశైలంల్లో ఉన్న విద్యాపీఠాలను ఎత్తివేయాలని తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఏపీలోని రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలంలలో ఉన్న విద్యాపీఠాలను ఎత్తివేస్తున్నామని, ఆగస్టు నుంచి అక్కడ ఉద్యోగులకు తమకు సంబంధం లేదని, జీతాలు ఇవ్వలేమని హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎల్లూరి శివారెడ్డి రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయ పీఠం డీన్ ప్రొఫెసర్ జీఎస్ భాస్కర్కు ఇటీవల ఫోన్ చేసి చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ఆ మధ్య ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి ప్రస్తావించారు.
కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఆ విషయంపై సరైన కార్యాచరణ చేపట్టలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉనికి ప్రమాదంలో పడింది. 1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుభాష మీద అభిమానంతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దానికి అనుబంధంగా వరంగల్, కూచిపూడి, శ్రీశైలం, రాజమండ్రి ప్రాంతాలలో పీఠాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయాన్ని విభజించవలసి ఉండింది. ఆస్తుల, ఉద్యోగుల పంపకాలు జరగాల్సి ఉంది. కానీ ఏడాది లోపు అవేవీ జరగలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏపీలోని మూడు పీఠాలనూ ఎత్తివేసింది. దీంతో ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ కాలేదు. ప్రస్తుతం రెండవ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే పాఠాలు చెబుతున్నారు.
రాజమండ్రి సమీపంలో బొమ్మూరు కొండ మీద 1987-88 నుంచి తెలుగు సాహిత్య పీఠం నడుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఏకంగా విశ్వవిద్యాలయమే ఇక్కడకు వస్తుందని అనుకున్నారు. కానీ అందుకు అవసరమైన చర్యలేవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టలేదు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో 224మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఏపీ పరిధిలో మూడు పీఠాల్లో పనిచేస్తున్న సుమారు 50 మంది ఉద్యోగులను తప్పించి, మిగతావారిని తెలంగాణ పరిధిలో కొనసాగిస్తున్నారు.