హుజూర్ నగర్ ఫలితంపై కార్మికుల్లో టెన్షన్ .. ఫలితంతో ముడిపడిన ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ?
హుజూర్ నగర్ ఉప ఎన్నిక అటు రాజకీయ పార్టీల నే కాదు ఇటు ఆర్టీసీ కార్మికులను సైతం టెన్షన్ పెడుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్ కు హుజూర్ నగర్ ప్రజలు ఉప ఎన్నికల్లో అనుకూలంగా తీర్పు ఇచ్చారా? లేక ప్రతికూలంగా తీర్పునిచ్చారా? అన్నది అటు రాజకీయ వర్గాలను,ప్రస్తుతం సీఎం కేసీఆర్ పై సమర శంఖం పూరించిన ఆర్టీసీ కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
హుజూర్ నగర్ ఫలితంపై బెట్టింగ్ ల జోరు: కాయ్ రాజా కాయ్ అంటున్న బెట్టింగ్ రాయుళ్ళు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై ఆర్టీసీ కార్మికులలో ఉత్కంఠ
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇస్తే అది గులాబీ బాస్ కెసిఆర్ పరిపాలన పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారు అని చెప్పినట్లవుతుంది. ప్రతికూలంగా తీర్పు వస్తే సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అని తేలినట్టుందే అని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. అందుకే హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల విషయంలో కార్మికులు సైతం చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు.
భవిష్యత్ పరిణామాలకు సంకేతం కానున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం
ఆర్టీసీ కార్మికుల సమ్మె 18 రోజుకు చేరింది. 18 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టనట్టు తన పని తాను చేసుకు పోతుంది. ఇక ఈ నేపథ్యంలో ఇదే సమయంలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టు కావాలని ఆర్టీసీ కార్మికులు సైతం భావిస్తున్న పరిస్థితి. హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం తరువాతి రాజకీయ పరిణామాలను, రాష్ట్రంలోని రాజకీయ పరిస్తితులను నిర్ణయం చేస్తుందని ఆర్టీసీ కార్మికులభావన .
ఎన్నికల ముందు పరిణామాల ప్రభావం ఎన్నికలపై ఉంటుందా ?
అధికార టీఆర్ఎస్ నిరంకుశ విధానాలను ప్రజలు సైతం చీ కొట్టాలని ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కేవలం రెండు రోజుల ముందుఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన బంద్ కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ కావడం, ప్రజల నుండి స్పందన కూడా బాగుండటంతో ప్రజల మద్దతు తమకే ఉందని ఆర్టీసీ జేఏసీ వర్గాల్లో ఒక భావన వ్యక్తమైంది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ గెలుపుపై పూర్తి ధీమాతో ఉంది .ఎన్నికల ముందు పరిణామాల ప్రభావం ఎన్నికలపై ఉంటుందా లేదా అన్న చర్చ కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది.
పోలింగ్ తర్వాత సీన్ రివర్స్
అయితే రెండు రోజుల వ్యవధిలో ఈ సీన్ మొత్తం మారిపోయింది. నిన్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసేసరికి భారీగా పోలింగ్ సాగుతున్న నేపధ్యంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు పోల్ అయినట్లుగా నిర్దారణకు వచ్చారు. అనుకున్నట్లే పోలింగ్ ముగిసే సమయానికి ఏకంగా 84.75 శాతం ఓట్లు పోల్ కావటంతో ఈసారి విజయం తమదేనని టిఆర్ఎస్ పార్టీ ధీమా తో ఉంది. ఇక అందుకు తగినట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం కారు దూసుకుపోతుందని చెప్పడంతో అటు రాజకీయ వర్గాల్లోనే కాదు, ఇటు ఆర్టీసీ కార్మికులను టెన్షన్ పట్టుకుంది.
పోలింగ్ ముందు రోజు వరకు పరిస్థితి వేరు .. పోలింగ్ తర్వాత మారిన సీన్
పోలింగ్ కు రోజు ముందు వరకూ కూడా హుజూర్ నగర్ ఎన్నిక ఫలితం అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉంటుందని అదే జరిగితే తమ సమ్మె విషయంలో కేసీఆర్ మెట్టు దిగటమే కాదు సంధికి వస్తారని అంచనా వేశారు. దీంతో.. ఆర్టీసీ కార్మికులు సైతం పట్టుదలతో ఉన్నారు. ఎప్పుడైతే హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయో అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులకు ఈ వార్త షాక్ గా అనిపిస్తోంది.
ఫలితాలతో తమ సమస్య పరిష్కారం ముడిపడిందని భావిస్తున్న కార్మికులు
హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికసమ్మె కొనసాగినప్పటికీ మొండిగా ప్రవర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు హుజూర్ నగర్ ఫలితం సానుకూలంగా వస్తే ఆయన మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మికులు సైతం భావిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం సీఎం కేసీఆర్ కు అనుకూలంగా రాకూడదని కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కానీ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఆర్టీసీ కార్మికుల లో ఊహించని టెన్షన్ మొదలైంది. తమ సమస్యల పరిష్కారం హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలతో ముడిపడి ఉంటుందని భావించిన ఆర్టీసీ కార్మికుల్ని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో అన్న భయాందోళన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.