హరీష్ రావు ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. రాళ్ళ దాడి, భగ్గుమన్న కేటీఆర్!
ఖమ్మం జిల్లాలో వర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వారిని ఆదుకోవడానికి వారికి మేమున్నామని భరోసా ఇవ్వడానికి బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు నేడు ఖమ్మం వెళ్లారు. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ మాజీ మంత్రుల వాహనాలపై రాళ్ళ దాడి, హరీష్ రావు ఫైర్
హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ వాహనాలపైన కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన రాళ్ల దాడి ఘటన పైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన నిప్పులు చెరిగారు.

బడ్జెట్లోనే కాదు వరద సాయం లో కూడా సున్నా
ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే కేంద్రం నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎందుకు రాలేదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బడ్జెట్లోనే కాదు వరద సాయం లో కూడా సున్నా అంటూ హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మహబూబాబాద్, ఖమ్మం ప్రజలు బలైపోయారన్నారు.
భగ్గుమన్న కేటీఆర్
అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళితే ప్రధానిని నిలదీద్దాం అని హరీష్ రావు అన్నారు.సాగర్ కెనాల్ కొట్టుకుపోవడం వల్ల వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఖమ్మం దాడి ఘటన పైన కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నేతలపైన దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్ మాజీ మంత్రుల వాహనాలపై దాడి చేయడం వారి అసహనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
ఖమ్మంలో దాడి బాధ్యత ముఖ్యమంత్రిదే
ప్రజలకు సహాయం చేయడం చేతగాక సాయం చేస్తున్న వాళ్ళని చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే తాము ప్రజలకు అండగా ఉన్నామని అది తప్పా అని ప్రశ్నించారు. సేవ చేయడం చేతకాకపోగా, సేవ చేసే వారిపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఖమ్మం లో జరిగిన దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు కేటీఆర్.
ఎన్ని దాడులు చేసినా ప్రజల వద్దకు వెళ్ళకుండా ఆపలేరు
ఎవరెన్ని దాడులు చేసినా సరే ప్రజల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని కాంగ్రెస్ చేతగాని, అసమర్ధ, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. కచ్చితంగా సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications