బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు: గన్నారంలో ఉద్రిక్తత
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి.
ఎంపీ ధర్మపురి అరవింద్ రాకకు గంట ముందే టీఆర్ఎస్ కార్యకర్తలు గన్నారం ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలకు రావడమేంటని ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ కాన్వాయ్ రాగానే టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్వల్పలాఠీ ఛార్జీ చేశారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వెంటనే ఎంపీ అరవింద్ కాన్వాయ్ ను పోలీసులు ముందుకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన నేతలను అడ్డుకోవడంపై ఎంపీ అరవింద్ మండిపడ్డారు.
గన్నారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. తనను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో 60 శాతం నిధులు కేంద్రానివేనని అన్నారు.
గన్నారం గ్రామానికి ఎంపీల్యాడ్ నిధులు 10లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. తనను అడ్డుకునేలా ప్రోత్సహించినందుకు స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు థ్యాంక్స్ చెప్పారు అరవింద్. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రం కోడిగుడ్డు కూడా కొనలేదని చురకలంటించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్నారు. రాజకీయాలకు ఇంకా టైముందని అరవింద్ టీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు.
రేపు యథావిధిగా బీజేపీ నిరుద్యోగ దీక్ష: బండి సంజయ్ దీక్ష వేదిక మార్పు
బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష సోమవారం యధావిధిగా జరపనున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం కరోనా ఆంక్షల పేరుతో సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించడంతో ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన దీక్షను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మార్చారు. బీజేపీకి ఎక్కడ ఆదరణ పెరుగుతుందోనన్న భయంతోనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపడతారని నేతలు తెలిపారు.