రణరంగంగా ఉస్మానియా: 'మురళి' ఆత్మహత్యతో మండుతోన్న కొలిమిలా!..
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కొలిమిలా మండిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మళ్లీ అట్టుడుకుతోంది. విద్యార్థుల వీపులపై పోలీసు లాఠీలు విరుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి హాస్టల్ గదుల్లోకి దూరి మరీ పోలీసులు వారిని చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
సహజంగానే తొలి నుంచి ఉస్మానియా అంటే ప్రభుత్వానికి ఒక రకమైన వ్యతిరేకత ఉందనే విమర్శ ఉంది. సీఎం కేసీఆర్ విధానాలను, ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యాన్ని వర్సిటీ విద్యార్థులు ఎప్పటికప్పుడు నిరసిస్తూనే ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం 'చేద్దాం.. చూద్దాం.' అన్నట్లుగానే సాగుతుంది తప్ప ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు.
Recommended Video
ఓయు విద్యార్థి ఆత్మహత్యలో ట్విస్ట్: సూసైడ్ నోట్ మార్చారా?
ఈ నేపథ్యంలో ఎమ్మెస్సీ విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవడం విద్యార్థుల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఆర్ట్స్ కాలేజీ ముందు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మురళి ఆత్మహత్య:
పేద కుటుంబం నుంచి వచ్చిన మురళిపై అతని కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది. తండ్రి మరణం తర్వాత తల్లే అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తోంది. కొడుకు చేతికి అందివచ్చాడనుకుంటున్న తరుణంలో.. మురళి ఆత్మహత్య చేసుకోవడం ఆ తల్లిని కుంగదీసింది. 'టెన్షన్ తట్టుకోలేకనే చనిపోతున్నానను' అంటూ మురళి రాసిన సూసైడ్ నోట్ పై విద్యార్థులు అనుమానాలు లేవనెత్తుతున్నారు.
విద్యార్థులే కూల్చేస్తారు:
ఉస్మానియా విద్యార్థి మురళి మరణంపై టీడీపీ నేత ఎల్.రమణ స్పందించారు.తెలంగాణ కోసం ఏ విద్యార్థులైతే పోరాడారో అదే విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం రాదనే బెంగతోనే ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డానని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మురళి కుటుంబానికి రూ.50లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రణరంగంగా ఉస్మానియా:
మురళి ఆత్మహత్య తర్వాత ఆదివారం రాత్రి నుంచి యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. సోమవారం ఉదయం విద్యార్థులు మరోసారి ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. మురళి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
విద్యార్థుల అరెస్టులు:
విద్యార్థులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోగా.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డారన్న కారణంతో దాదాపు 34మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ ప్రకటించారు.
నేతలు క్యాంపస్లోకి రావటం వల్లే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆయన అన్నారు. మరోవైపు మురళి ఆత్మహత్యపై కావాలనే అతి చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి చనిపోతే.. దాన్ని ఉద్యోగ నోటిఫికేషన్లతో ముడిపెట్టి చూస్తున్నారనేది వారి వాదన.