పదో షెడ్యూల్ సంస్థలు: చంద్రబాబు మీద కెసిఆర్ పైచేయి
హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయోమయం, గందరగోళానికి గురవుతుండగా, తెలంగాణ ప్రభుత్వం అన్నీ చక్కబెట్టుకుంది.
ఏడాది పాటు ఆ సంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు గందరగోళానికి గురవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటైన సంస్థలను వాటి కార్యకలాపాలు, పని స్వభావాన్నిబట్టి 9, 10 షెడ్యూళ్లలో చేర్చారు. పదో షెడ్యూల్లో విద్యా, శిక్షణా సంబంధిత సంస్థలున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థ ఆ రాష్ట్రానికే చెందుతుందని విభజన చట్టంలో స్పష్టంగా చెప్పింది.
కాగా, విభజన చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిపాటు ఈ సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలందించాల్సి ఉంటుంది. ఈలోపు రెండు రాష్ట్రాల్లో ఆయా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాది గడవకముందే పలు సంస్థలపై వివాదాలు తలెత్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పదో షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. అందులో అత్యధిక శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. చట్టప్రకారం తెలంగాణ భూభాగంలో ఉన్న సంస్థలకు ఏపీ ప్రభుత్వమే కొత్త యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ మేరకు శుక్రవారం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

ఇప్పుడున్న సంస్థల నుంచి ఉద్యోగులు, అప్పులు, ఆస్తుల విభజన చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి పెట్టలేదు. దీంతో ఏడాది గడువు ముగియగానే తెలంగాణ ప్రభుత్వం తన భూభాగంలో ఉన్న అన్ని సంస్థలపైనా హక్కు తమదే అని ప్రకటించుకుంది. ఇటీవలే తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు తమవేనని, ఏపీ విద్యార్థులకు సేవలందించబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సంస్థల సేవలు కావాలంటే జనాభా ప్రాతిపదికన ఖర్చులు ఎపి ప్రభుత్వం భరించాలని, అందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాలని తేల్చిచెప్పింది. ఆయా సంస్థల నిర్వహణ వ్యయంలో 58 శాతం భరిస్తామని, తమ రాష్ట్ర విద్యార్థులకూ సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఇందుకు తెలంగాణ కూడా అంగీకరించింది. కానీ, ఎంవోయూ విషయంలో తేడాలు వచ్చాయి.
ఉన్నత విద్యామండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పదో షెడ్యూల్ సంస్థలన్నీ తమకే వర్తిస్తాయంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈలోపు ఒప్పందాలు కుదుర్చుకుంటే వాటిపై హక్కులు శాశ్వతంగా పోతాయని ఏపీ భావిస్తోంది. విద్యార్థులు నష్టపోకుండా ఉమ్మడి సేవలందించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ను కూడా కోరింది. ఎంవోయుకు రాకపోవడంతో ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల విషయంలో ప్రతిష్టంభన అలాగే ఉండిపోయింది.
ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక కథనం ప్రకారం - తాజాగా మరో సమస్య ఎదురైంది. ఈ నెల 18వ తేదీతో సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ జన్నత్ హుస్సేన్ పదవీ విరమణ చేస్తున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ అడ్మినిసే్ట్రటివ్ ట్రిబ్యునల్లో ఒక సభ్యుడి పోస్టు ఖాళీ అవుతోంది. ఉమ్మడిగా ఉన్న మానవ హక్కుల కమిషన్ సభ్యుల నియామకం కూడా చేపట్టాల్సి ఉంది. ఈ సంస్థలకు నియామకాలు ఎవరు చేపట్టాలనే సందిగ్ధత ఏర్పడడంతో ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా కోరింది.
ఏడాది గడువు ముగిసినందున ఆయా సంస్థల సేవల కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడమే మేలని న్యాయ శాఖ తేల్చిచెప్పింది. ఒకవేళ ఎంవోయూ కుదుర్చుకోవడం ఇష్టం లేకపోతే అవసరమైన మేరకు కొత్త సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఇంకా, సర్వే అకాడమీ కూడా తమదేనని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం కొత్త అధికారిని నియమించుకుంది. దీంతో పదో షెడ్యూల్లోని ఏ సంస్థ నిధుల నుంచి కూడా ఏపీకి వాటా వస్తుందన్న నమ్మకం పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి వల్ల ఆ రాష్ట్రానికి చెందిన ఈ సంస్థల్లోని ఉద్యోగులు తీవ్ర అసహనానికి, నిరాశకు గురవుతున్నారు. తెలుగు అకాడమీ వంటి సంస్తల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications