రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ 10 వేలు జమ..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదలతో నష్టపోయిన రైతాంగానికి ఆర్దిక సాయం పైన ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. రానున్న రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. వరదలతో రూ 10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు చెప్పుకొచ్చారు. నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
రైతులకు సాయం
భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10 వేలు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్.. కేంద్ర ప్రభుత్వ నేతలను కలవనున్నారని, వారికి ఇక్కడ వరద నష్టాన్ని వివరించి ఆర్థిక సాయం కోరతారని తెలిపారు. . ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి వంద మందికి విపత్తు నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. వరద విపత్తులకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నామని పొంగులేటి వివరించారు.

బాధితులకు అండగా
రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటోంది. తక్షణ సాయంగా ఒక్కో ఇంటికి రూ.16,500 అందిస్తోంది. నేరుగా ఈ డబ్బులను అకౌంట్లలోనే జమ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే వరద బాధితుల అకౌంట్లలో అధికారులు డబ్బులు జమ చేస్తున్నారు. సాయం ఇంకా అందని వారికి ఆందోళన అవసరం లేదని ప్రతీ ఒక్కరికి పరిహారం అందుతుందని హామీ ఇస్తున్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టం పైన నివేదికలు అందించింది.
సర్టిఫికెట్ల కోసం
ఇటు వరదల కారణంగా చాలా ఇళ్లలోకి నీరు చేరి భూ, ఆస్తి పత్రాలు, ఆధార్, రేషన్ కార్డులతో పాటు విలువైన అనేక పత్రాలు తడిసిపోవడం, కొట్టుకుపోవడం జరిగాయి. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ పత్రాల కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన చోట దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలా ఆ దరఖాస్తును పరిశీలించి డూప్లికేట్ పత్రాలను అందిస్తామని, తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం భరోసా కల్పించింది.












Click it and Unblock the Notifications