మహిళల ఖాతాల్లో రూ 2500 అమలు పై కీలక నిర్ణయం..!!
రేవంత్ సర్కార్ మరో హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రేవంత్..మరో కీలక హామీ పైన ఫోకస్ చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ మహిళకు రూ 2500 చొప్పున ప్రతీ నెలా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉచిత బస్సు, గృహజ్యోతి , గ్యాస్ సిలిండర్లు అమల్లోకి వచ్చాయి. తాజాగా రుణమాఫీ చేసిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మహాలక్ష్మీ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది.
హామీల అమలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ ప్రభుత్వ వరుసగా అమలు చేస్తోంది. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కీలకమైన మహాలక్ష్మీ పథకం అమలు పైన ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందచేస్తున్నారు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అమలు చేస్తున్నారు. రుణమాఫీ మూడు విడతలుగా అమలు చేస్తున్నారు.

మహాలక్ష్మీ పథకంపై
రుణమాఫీని రెండు లక్షల రూపాయల వరకూ మాఫీ చేసి అమలు చేశారు. ఆగస్టు 15వ తేదీతో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తారు. ఇక, మహాలక్ష్మీ పథకం అమలు కోసం అధికారులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అర్హులైన మహిళల జాబితా పైన లెక్కలు సిద్దం చేస్తున్నారు. ఎంత మంది మహిళలు అర్హులుగా ఈ పథకానికి ఎంపిక అవుతారు..ఏ మేర ఖజానా పైన భారం పడుతుందనే లెక్కల పైన అధికారులు కసరత్త చేస్తున్నారు. దీని ద్వారా ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
అర్హుల ఎంపిక కోసం
తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలను మహాలక్ష్మీ పథకానికి అర్హులుగా తేల్చనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు ముందే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం వద్ద దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ పథకాల్లో వేటిల్లోనూ లబ్దిదారులుగా లేని మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద రూ 2500 చొప్పున అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ పథకం పైన పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత అమలు దిశగా విధి విధానాలు ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications