కేంద్రం నిరాశపరిచింది.!దిగులుతో వెనుదిరుగుతున్నాం.!టీఆర్ఎస్ తడాఖా ఏంటో బీజేపికి చూపిస్తామన్న మంత్రులు.!
ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ మంత్రుల ఆశలు అడియాసలయ్యాయి. శుభవార్తతో తిరిగొస్తారనుకున్న మంత్రుల బృందం చేదు వార్తతో వెనుదిరిగారు.ధాన్యం కొనుగోలు అంశంలో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలిగిపోయి రైతులు ఆనందోత్సాహాల మద్య కొత్త సంవత్సరానిక స్వాగతం చెప్తారని అందరూ ఊహించారు. కాని కేంద్ర ప్రభుత్వం అందరి ఊహలను తలకిందులు చేస్తూ తమ మొండి వైఖరిని కొనసాగించింది. దీంతో గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన మంత్రుల బృందం గంపెడు బాదతో బరువెక్కిన హృదయాలతో తిరుగు విమానం ఎక్కారు.
కేంద్ర మంత్రుల హృదయం పాశానం.. అది కరిగే అవకాశాలు లేవన్న గులాబీ మంత్రులు
ఇదే అంశం పై వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సమాహారమని, రాష్ట్రాలను రాజ్యాంగ బద్దంగా ఎన్నికైనట్లుగా కేంద్రం చూడడం లేదని ఘాటు వ్యాఖలు చేసారు. కేంద్ర ప్రభుత్వ దయా, దాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారని, ఇలాంటి పోకడలు మంచిది కాదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గతంలో రాష్ట్రాల మనోభావాలను అవమానపరిచినవారు తగిన మూల్యం చెల్లించారని, ప్రస్తుతం బీజేపీ కూడా అదే పరిస్థితిలో ఉందని మంత్రి తెలిపారు. కోఆపరేటివ్ ఫెడరలిజం తెస్తామని ఆశ పుట్టించారని, నీతి ఆయోగ్ సిఫార్సులను పాటించకుండా, బీజేపి పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.
మారని కేంద్ర వైఖరి.. ధాన్యం కొనుగోలులో పంతంపడుతుందన్న రాష్ట్ర మంత్రుల బృందం
ఈ వానాకాలం పంట సేకరణలో పార్లమెంట్ లో చెప్పిన ప్రకారం ఎంతైనా కొంటామని, 60లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటామని రాతపూర్వకంగా ఇచ్చారని, మిగతా ధాన్యం సేకరణ అంశంలో స్పష్టత ఇస్తే, రైతుల వద్దనుండి కొనుగోలు చేయాలా వద్ద అని నిర్ణయం తీసుకుంటామని మరో మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఒకటి,రెండు రోజుల్లో ఇదే అంశంపై స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రులు చెప్పినట్టు మంత్రి స్పష్టం చేసారు. ధాన్యం కొనుగోలులో ఇప్పటివరకు స్పష్టత లేదని, వారం రోజులుగా కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు మంత్రి గంగుల కమనాలకర్.
అతిగా ప్రవర్తించిన వారు అంతం అయ్యారు.. రేపు బీజేపి కూడా అంతేనన్న గంగుల కమలాకర్
యాసంగిలో పంట కొనమని కేంద్ర బీజేపీ మంత్రులు స్పష్టం చెప్పిందు చెప్పుకొస్తున్నారని, కొనుగోలులో ఆర్డర్ వస్తుందని వారం నుంచి ఆశపడ్డామని కానీ నిరాశే ఎదురయ్యిందని అన్నారు. వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని గౌరవ ప్రదమైన మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెప్పారని గంగుల మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం బియ్యం ఇవ్వడంలేదని కేంద్రమంత్రులు చెప్తున్నారని, కానీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ధాన్యాన్ని రవాణా చేసుకునే బాధ్యత ఎఫ్సిఐ దని అన్నారు. ధాన్యాన్ని ఎఫ్సీఐ అదికారులు తీసుకెళ్లడం లేదని గంగుల తెలిపారు. తెలంగాణ రైస్ మిల్లుల్లో సరిపడా బియ్యం ఉన్నాయని, రవాణా చేసుకోవాలని 7 లేఖలు రాశామని గుర్తు చేసారు గంగుల కమలాకర్.
కేంద్రం పచ్చి దొంగాట.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్న మంత్రులు
అంతే కాకుండా తెలంగాణలో మొత్తం ఎఫ్ సి ఐ గోడౌన్లు బియ్యంతో నిండిపోయాయని, పక్క రాష్ట్రం ఏపీలోని జగ్గయ్యపేటలో ఖాళీగా ఉందని, అది ఇవ్వండి అని కూడా లేఖ ఇచ్చామన్నారు మంత్రి గంగుల. సంగారెడ్డిలో కూడా బియ్యం దిగుమతి ఎక్కువ ఉందని, పక్క రాష్ట్రం బీదర్ లో ఖాళీగా ఉన్నాయని, ఇవన్నీ బియ్యం నిల్వలకోసం అడిగామని, ఖాళీగా ఉంచుతాం కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేది లేదన్నట్టు వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఎంత కావాలంటే అంత బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదనే నిందలు మోపుతున్నారని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బిజెపి నాయకులు సమాధానం చెప్పాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేసారు.