టీఆర్ఎస్-ఏంఐఎం పార్టీలకు కాంగ్రెస్ "బీ" టీమ్ గా వ్యవహరిస్తోంది.!టీపిసిసిపై డీకే అరుణ ఫైర్.!
హైదరాబాద్ : తెలంగాణలో శాంతిభద్రతల అంశంగాని, పోలీసుల వ్యవస్థ పనితీరు గానీ ఎందుకంత నిర్లక్ష్యంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నాయకుడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని డీకె అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయం పై మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలికపై హత్యాచారం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం నాయకులకు సంబంధించిన వారిని కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో అసలు నిజాలను సాక్షాలతో పాటు వెలుగులోకి తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై పోలీసులు కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పై హత్యచారాలు జరుగుతుంటే వాటిని నియంత్రించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందితులకు సంబంధించిన వారి పై పోరాడకుండా, బీజేపీ కార్యాలయం, ఎమ్మెల్యే రఘునందన్ పై విమర్శలు చేయడం దేనికి సంకేతమని డీకే అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఏంఐఎం పార్టీలకు బీ టీమ్ గా వ్యవహరిస్తుందని డీకే అరుణ ధ్వజమెత్తారు. ఇకనైనా పోలీసులు పక్షపాత ధోరణిమాని, నిందితులకు కొమ్ముకాయకుండా, బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాలని, నగరంలో శాంతి భద్రతల పై శ్రద్ధ వహించాలని పోలీసులకు బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ సూచించారు.