తొలి జాబితాపై ఆగ్రహజ్వాలలు..! కాంగ్రెస్ నేతల్లో పెరుగుతున్న అసహనం..!!
హైదరాబాద్ : అనేక సర్వేల నివేదికలను పరిగణలోకి తీసుకుని, ఎన్నో కసరత్తుల తర్వాత చిట్టచివరిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యవేక్షణలో సోమవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్ధుల తొలి జాబితా తెలంగాణలో అనేక మంది పార్టీ నేతలకు తీవ్రమైన అసంతృప్తి మిగిల్చింది. ఓ పక్క సీనియర్ నాయకులు పలువురికి మొదటి జాబితాలో చోటు దక్కకపోవడం, బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని ఇలా పలు రకాల అసంతృప్తులు రాష్ట్రం నలుమూలల నుంచీ వెల్లువెత్తుతున్నాయి.
నేతలను ఖంగు తినిపించిన కాంగ్రెస్ తొలి జాబితా..! జాబితాలో పేరు లేకపోవడానికి కారణం అదేనా..!!
ఓ పక్క సొంత పార్టీ నేతల్లో పెల్లుబికుతున్న అసంతృప్తి ఒకటైతే భాగస్వామ్య పక్షాలు ఆశించిన పలు అసెంబ్లీ స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించడం పట్ల మిత్రపక్షాలైన సీపీఐ, టీజేఎస్ పార్టీలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సీపీఐ ఏవైతే తమకు కీలక స్ధానాలుగా ఆశించిందో ఆ స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించం జీర్ణించుకోలేకపోతోంది.
రెబల్స్ గా బరిలోకి పలువురు అసంతృప్త నేతలు..! కాంగ్రెస్ లో మొదలైన పంచాయితీలు..!!
కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయానికి వస్తే ముందుగా వరంగల్ జిల్లాలో నాయకులు మొదటి జాబితా చూసి హతాశులయ్యారు. జిల్లాలో గ్యారంటీగా గెలుపొందుతారనుకున్న జనగామ, భూపాలపల్లి స్ధానాలకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి టిక్కెట్ ఆశిస్తున్న వ్యక్తులు ఏమీ ఆషామాషీ వ్యక్తులు కారు. ఒకరు టీపీసీసీ అధ్యక్షులుగా, వరుసగా పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య కాగా మరొకరు ప్రభుత్వ విప్ గా పనిచేసిన, నియోజవర్గంలో మంచి ప్రజాదరణ కలిగిన గండ్ర వెంకటరమణారెడ్డి. తమ పేర్లు ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడం పట్ల ఈ ఇరువరు నాయకులు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. పొన్నాల అయితే అధిష్టానంతోనే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దపడి హుటాహుటీన ఢిల్లీ పయనమయ్యారు. జిల్లాలో నిన్న కాక మొన్న పార్టీలో చేరిన కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క)ల టిక్కెట్లను మొదటి జాబితాలో ప్రకటించి తమ పేర్లను ప్రకటించకపోవడం పట్ల గండ్ర వెంకటరమణా రెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్లను పక్కన పెట్టిన కాంగ్రెస్..!అదిష్టానం మర్మం తెలియక నలిగిపోతున్న నేతలు..!!
ఇక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా జాబితాలో లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. శశిధర్ రెడ్డి అయితే నిన్నటి నుంచి ఎవరితోనూ టచ్ లోకి రావడం లేదు. తమ కుంటుంబం పార్టీ కోసం ఇంతకాలం నుంచి కష్ట పడుతుంటే తన పేరు మొదటి లిస్ట్ లో లేకపోవడం ఏంటని శశిధర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఖచ్చితంగా సొంత పార్టీలో నేతలే తనకు సీటు రాకుండా అడ్డుపడుతున్నారని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ విషయం అధిష్టానంతోనే తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇక కంటోన్మెంట్ స్ధానం ఆశించిన ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు క్రిషాంక్ తనకు సీటు ఇవ్వక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.గతంలో 2014లో కూడా నాకు టిక్కెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసేసుకున్నారని... గడచిన నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో రేయింబవళ్లు తిరిగి కష్టపడ్డ తనను కాదని సర్వేసత్యనారాయణకు టిక్కెట్ కేటాయించడం పట్ల ఆయన కినుక వహించారు. సాయంత్రం తన భవష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటానని క్రిషాంక్ ఇప్పటికే ప్రకటించారు.
భాగస్వామ్య పక్షాల్లోనూ అసంతృప్తి..! కాంగ్రెస్ వైఖరి పై మండిపాటు..!!
ఇక ప్రధానంగా బీసీలకు ఇవ్వాల్సినన్ని టిక్కెట్లు ఇవ్వలేదని ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తాజా మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అయితే కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ ఆయ్యిండి బీసీలకు ఇంత అన్యాయం చేస్తుందా అని కృష్ణయ్య ప్రశ్నిస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ బీసీలను విస్మరించినందుకు నిరసనగా ఆయన రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలపునిచ్చారు. అయితే నిన్న ప్రకటించిన కాంగ్రెస్ జాబితాలో కొత్తగూడెం స్ధానం నుంచి వనమా వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేశారు. అలాగే నకిరేకల్ నియోజకవర్గం కూటమిలో మరో భాగస్వామి అయిన తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయించనునట్లు గతంలో ప్రకటించారు. అయితే ఈ ప్రకటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకిరేకల్ తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్ధానాల్లో రెబల్స్ నిలబెడతానని అధిష్టానానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ కు అంతర్గత వార్ తప్పదా..! అసంత్రుప్తులను ఎలా బుజ్జగిస్తారో...!!
దీంతో ఖంగుతున్న కాంగ్రెస్ నాయకత్వం కోమటిరెడ్డి వార్నింగ్ కు తలొగ్గి నకిరేకల్ చిరుమర్తి లింగయ్యకే కేటాయించారు. దీంతో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూటమిలో కొనసాగడంపై పునరాలోచన చేస్తున్నారు. అలాగే కోదాడ సీటును నిన్నమొన్నటి వరకూ టీడీపీకి ఇస్తారని ప్రచారం చేసి తీరా మొదటి జాబితాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి కేటాయించిడం పట్ల టీడీపీ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రెబల్ గా పోటీ చెయ్యాలని నిర్ణయించుకుని అనుచరులతో సమావేశం అయ్యారు. మొత్తం మీద కాంగ్రెస్ తొలి జాబితా ఇటు సొంత పార్టీలోనే కాకుండా అటు భాగస్వామ్య పక్షాల్లో కూడా అసంతృప్తి రగిల్చింది. మొదటి జాబితాలో టిక్కెట్లు దక్కని కాంగ్రెస్ నాయకులందరూ ఢిల్లీబాట పట్టారు. వీరి పేర్లు రెండో జాబితాలో ఉంటాయో లేక బుజ్జగించి పంపించెస్తారో వేచిచూడాలి.