IBomma Raviని పట్టించింది భార్య కాదు.. ఆ మెసేజ్..! పోలీసు విచారణలో..!
టాలీవుడ్ సినిమాల్ని పైరసీ చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటికి ఉచితంగా చేర్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఇమ్మడి రవికుమార్ (ఐబొమ్మ రవి)పై హైదరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రవిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు ఆయన నుంచి కీలక వివరాలు మాత్రం రాబట్టలేకపోయినట్లు సమాచారం. అందుకే మరోసారి రవిని కస్టడీకి ఇవ్వాలని కోరబోతున్నారు. అయితే ఈ కేసు విచారణలో పురోగతి లేకపోయినా ఐబొమ్మ రవిని పోలీసులు ఎలా పట్టుకున్నారన్న విషయం బయటికి వచ్చింది.
తొలుత పారిస్ నుంచి వచ్చిన ఐబొమ్మ రవిని తన భార్యే పోలీసులకు చెప్పి పట్టించినట్లు ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులతో పాటు అతని సన్నిహితులు కూడా ఖండించారు. మరి రవి ఇంత సులువుగా పోలీసులకు ఎలా చిక్కాడన్న దానిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. "మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం"అంటూ తన స్నేహితుడికి రవి పంపిన ఓ మెసేజ్ ఆయన్ను పోలీసులకు పట్టించినట్లు తేలింది.

సినిమాలు పైరసీ చేస్తున్న పలు వెబ్ సైట్లపై హైదరాబాద్ పోలీసులు ఎప్పటి నుంచో నిఘా పెట్టారు. ఈ కేసులో కొందరు అనుమానితుల్ని సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఐబొమ్మ రవిని మాత్రం ఇంత సులువుగా పట్టుకుంటామని వారు కూడా అనుకోలేదు. కానీ రవిపై గట్టి నిఘా మాత్రం కొనసాగించారు. అదే సమయంలో తాజాగా ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ వచ్చిన రవి.. "మామా హైదరాబాద్ వచ్చా..కలుద్దాం" అంటూ తన స్నేహితుడికి మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు.. రవి నగరానికి వచ్చినట్లు నిర్ధారించి, అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో ఇటీవలే పైరసీ నేరం కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో రవి ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట డొమైన్లు కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్పై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఇదే క్రమంలో రవి విదేశాల్లో ఉంటూ, అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి ఒక స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకుంటాడని గుర్తించారు. దీంతో రవి హైదరాబాద్ వస్తే చెప్పాలని అతని స్నేహితుడికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో అతను రవి మెసేజ్ పెట్టగానే పోలీసుల్ని అలర్ట్ చేసి పట్టించాడు.












Click it and Unblock the Notifications