మనసున్న మారాజు మల్లారెడ్డి : ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి వైద్యం, కొనియాడుతున్న నెటిజన్లు
హైదరాబాద్ : రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. లారీ టైర్ కింద పడి కాలు నుజ్జునుజ్జయ్యింది. అతని హాహాకారాలతో ఆ ప్రాంగణం మిన్నంటింది. కానీ దారిలో వెళ్తున్న వారు ఎవరూ పట్టించుకోలేదు. కానీ మంత్రి కారు ఆగింది .. బాధితుడి పడుతున్న బాధను చూసి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
లారీ రూపంలో ..
సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది. బాలానగర్ వెళ్లున్న బాలస్వామిని వెనుకనుంచి వస్తోన్న లారీ ఢీకొంది. తర్వాత అతను కిందపడటంతో వెనుక టైరు కాలు మీది నుంచి వెళ్లింది. దీంతో అతనిది అరణ్యరోదనే. రోడ్డుపై రోదన మిన్నంటిది. దీంతో ఆ సమయంలో బోయిన్పల్లి నుంచి కూకట్ పల్లి వెళ్తున్నారు మంత్రి మల్లారెడ్డి. ప్రమాదం చూసి ఆగారు. క్షతగాత్రుడి పరిస్థితి చూసి చలించిపోయాడు. వెంటనే తన కారులో బాలస్వామిని నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. క్షతగాత్రుడికి దగ్గరుండి వైద్యం చేయించారు. బాలస్వామి పరిస్థితి మెరుగ్గా ఉందని .. భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయారు.

పరారీలో డ్రైవర్ ...
బాలానగర్ రాజు కాలనీకి చెందిన బాలస్వామి మేస్త్రీగా పనిచేస్తుంటాడు. సోమవారం కూడా పనికి వెళ్లి సైకిల్పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమయానికి మంత్రి చూసి స్పందించడంతో .. అతను ప్రాణాలతో బయటపడ్డారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ కిషన్ తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీని అక్కడున్న స్థానికులు ఆపారు. కానీ డ్రైవర్ అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి స్పందించిన తీరుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు, నెటిజన్లు మంత్రి శెభాష్ అంటూ కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications