Peddagattu: పెద్దగట్టు జాతరలో దిష్టిపూజ ఘట్టం పూర్తి.. ఇక జాతర తరువాయి..
తెలంగాణలో ముఖ్యమైన జాతరల్లో మేడారం, పెద్దగట్టు, నాగోబా ముఖ్యమైనవి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. మరోవైపు ఉమ్మడి నల్గొండలో జరగబోయే పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం దురాజ్ పల్లిలోని పెద్దగట్టులో అర్ధరాత్రి దాటాక ఘనంగా దిష్టిపూజ మహోత్సవం పూర్తయింది.
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనుంది. జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు ఆనవాయితీగా చేసే తొలి ఘట్టమైన దిష్టిపూజ కార్యక్రమాన్ని యాదవులు ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయపాలెం నుంచి సూర్యాపేట మండలం కేసారంకు అందెనపు సౌడమ్మ దేవరపెట్టెను తీసుకొచ్చారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే దురాజ్పల్లికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీకటిపాలెం గ్రామానికి చెందిన యాదవ సంఘంలో పూజారులుగా ఉన్న తండా పుల్లయ్య కుటుంబం ఈ పెట్టెను కలిగి ఉంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలే నుంచే గాక ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలివచ్చి ఓ లింగా.. ఓలింగా అంటూ భేరీలు మోగిస్తూ గజ్జెలు ఉన్న దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ లింగమంతుల స్వామిని స్మరించుకున్నారు.
అయితే పెద్దగట్టు జాతరను గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. ఇక్కడ లింగమంతులు స్వామి, చౌడమ్మ దేవతలు ఉంటారు. వీరి పేరిట ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర నిర్వహిస్తారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర మేడారం తర్వాత ఈ దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర పేరుగాంచింది. ఈ జాతరను శివరాత్రికి ముందు నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ ఉత్సవాల్లో యాదవులు కీలకపాత్ర పోషిస్తారు.