ఇద్దరు తెలుగు ముఖ్య మంత్రుల గొప్పలు చెప్పుకుంటున్నారు..!! కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఢిల్లీ / హైదరాబాద్ : ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇద్దరు ముఖ్యమంత్రులు వివాదాల సృష్టించి, నేను గొప్ప నేను గొప్ప అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. థర్డ్ ఫ్రంట్ లోని పెద్ద నాయకులు తనను ప్రత్యేకంగా కలుస్తున్నారని, ఇప్పటికి ఆరు పెద్ద పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించానని పాల్ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఊహాతీతంగా ఉందని, అన్నింటిలో తామే నెంబర్ వన్ అని చంద్రబాబు అంటున్నారని చమత్కరించారు పాల్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ కరువయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఆస్పత్రులు, ప్రజలకు ఆహారం అందుబాటులో లేవని ఘాటుగా విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేఏ. పాల్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేశారు.
తెలంగాణలో జీవనోపాది కోసం ప్రజలు వలసలు వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గల్ప్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుందో చంద్రశేఖర్ రావు వివరించాలని పాల్ డిమాండ్ చేసారు. నాలుగు కోట్ల ఆంధ్ర ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం పెరిగిపోయిందని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడడం, అభివృద్ధి జరపడమే తమ లక్ష్యమని పాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేయబోతున్నామని, ఈ 29న విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజా శాంతి పార్టీలో చేరుదామని ఆసక్తి ఉన్నవాళ్ళు వైజాగ్ రావాలని ఆయన కోరారు. 13 జిల్లాల్లో బూత్ లెవెల్ కమిటీ లతో చర్చలు జరుగుతున్నాయని, తమ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేస్తుందని, మిగతా పార్టీలు కుటుంబ, కుల పార్టీలని పాల్ స్పష్టం చేశారు.