రైల్లో పదిహేడు గంటలు మత్తులోనే..!: దోపిడీ ఘటనలో బాధితుల పరిస్థితి ఇదీ
యశ్వంతాపూర్ నుంచి లక్నో ఎక్స్ప్రెస్లో మత్తుమందు ప్రయోగంతో ఆరుగురు ప్రయాణికులను పదిహేడు గంటలపాటు మత్తులోనే ఉంచింది.లక్నో ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తోటి ప్రయాణిక
వరంగల్: యశ్వంతాపూర్ నుంచి లక్నో ఎక్స్ప్రెస్లో మత్తుమందు ప్రయోగంతో ఆరుగురు ప్రయాణికులను పదిహేడు గంటలపాటు మత్తులోనే ఉంచింది.
లక్నో ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తోటి ప్రయాణికుల శీతల పానీయంలో మత్తు మందు కలిపి వారి వద్ద నున్న రూ.27,000లను, రెండు సెల్ఫోన్లు, రెండు సంచులను దోచుకుని వెళ్లారు.
యశ్వంతాపూర్లో రైలు 23.40 గంటలకు బయలుదేరి కొంత దూరం వెళ్లాకే ఇద్దరు వ్యక్తులు మజా బాటిల్ తీసుకొచ్చి వీరికి శీతల పానీయం అందించినట్లు తోటి ప్రయాణికులు చెబుతున్నారు.
రాత్రి కావడంతో తాగిన వెంటనే ఇంద్రజిత్, మహేష్, సావంత్, సుశ్మిత్, నారాయణ, సంజీయ్, రానాదూబే ఆరుగురు నిద్రలోకి జారుకున్నారు. తోటి ప్రయాణికులు కూడా రాత్రి కావడంతో నిద్రలోకి వెళ్లారు. ఇదే అదనుగా దండగులు వీరి జేబుల్లో ఉన్న సొమ్మును తీసుకొని కోచ్ నుంచి జారుకున్నారు.
ఉదయం సాధారణంగా అందరూ ప్రయాణికులు లేచారు. కానీ మత్తులో ఉన్న వారు లేవకపోవడంతో అనుమానించి ప్రయాణికులు నిద్రలేపడానికి ప్రయత్నించారు. అప్పుడు రైలు కాచిగూడలో ఉంది.
ఇక్కడ 10.50 గంటల సమయంలో ఈ ప్రయత్నం చేశారు. అయినా నిద్రలేవలేదు. అనుమానం కలగడం అప్పటికే కాచిగూడ నుంచి రైలు బయలుదేరడంతో సమాచారాన్ని నేరుగా కాజీపేట జీఆర్పీ సిబ్బందికి అందించారు. ఆర్పీఎఫ్ సీఐ వీరన్నతో కలిసి జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై దయాకర్లు బాధితుల ముఖం మీద నీరు చల్లి లేపే ప్రయత్నం చేశారు. ముగ్గురు కాస్త కళ్లు తెరిచారు.
కానీ మిగతా వారు తెరవలేదు. వీరందరిని ఆసుపత్రికి పంపారు. సాయంత్రం 15.00 గంటల వరకు కూడా మత్తులో నుంచి బయటకు రాలేదు. వైద్యులు కడుపులో ఉన్న మత్తును పోగొట్టడానికి ప్రయత్నించారు. కానీ వారికి సాధ్యం కాలేదు. మధ్యాహ్నం 15.15 గంటల తర్వాత వారు కోలుకోవడం ప్రారంభించారు.
ఎంత చెప్పినా వినరే..
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రైలు కోచ్లలో ప్రయాణికులు తినుబండారాలు తీసుకోకూడదని రైల్వే పోలీసులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. అయినా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఎక్కువగా బల్లార్షా మార్గంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుండేవి.
విష్ణుపురికి చెందిన ఒక వ్యక్తి గతంలో మత్తుకు గురి కావడంతో ఇతను మద్యం తాగాడాన్ని తోటి ప్రయాణికులు నాగపూర్ రైల్వేస్టేషన్లో ప్లాటుఫారం మీద పడుకోబెట్టి వెళ్లారు. అక్కడ నుంచి ఆయన మత్తు నుంచి బయటకు వచ్చాక తన బంధువులకు ఫోన్ చేసి చికిత్స చేసుకున్నారు. లేకపోతే ప్రాణాపాయం ఉండేది.
ప్రస్తుత ఘటనలోనూ కాచిగూడలో గుర్తించి కాజీపేటలో చికిత్స అందించకపోతే బాధితుల పరిస్థితి విషమించేదని వైద్యులు చెబుతున్నారు. రైళ్లలో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని అపరిచితులను దగ్గరకు రానివ్వకుండా ఉండాలన్నారు. ఒకవేళ వచ్చినా వారు ఇచ్చే పదార్థాలను తీసుకోకూడదని రైల్వే పోలీసులు తెలిపారు.