వాళ్లేదో చందమామను ఇచ్చినట్లు, రేవంత్ ముచ్చట తీరుద్దాం: కెటిఆర్
హైదరాబాద్: ప్రతిపక్షాలు తమ హయాంలో ఏదో అభివృద్ధి చేసినట్టు మాట్లాడుతున్నాయని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ‘వాళ్లేదో చందమామను మా చేతికి చందమామను ఇచ్చినట్టు మేం మసి పూసి నల్లగా చేసినట్టు మాట్లాడుతున్నారు. 60 ఏళ్లు చేసేదంతా చేసి మమ్మల్ని విమర్శిస్తున్నారు. డొక్కు పాలన చేసి ఇవాళ మళ్లీ ఓట్లు వేయండని వస్తున్నారు' అని ఆయన అన్నారు.
‘ఓటర్లు బాగా ఆలోచించి ఓటు వేయండి. ప్రతిపక్షాలు గెలిస్తే పనులు కావు. జోగిజోగి రాసుకుంటే బూడిదే రాలుతదన్నట్టు ఉంటుంది. టీఆర్ఎస్ను గెలిపించండి. హైదరాబాద్ నగరాభివృద్ధికి సహకరించండి' అని కోరారు. ‘బీఎన్రెడ్డి నగర్లో అనేక సమస్యలున్నాయని తెలుసు. రిజిస్ట్రేషన్తోపాటు అనేక సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం సీఎం కేసీఆర్తోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ అక్కడా లేదు, ఇక్కడా లేదు. బీజేపీ ఇక్కడలేదుగానీ కేంద్రంలో అధికారంలో ఉన్నాలేనట్టే. అందుకే సమస్యల పరిష్కారం కోసం కారు గుర్తుకు ఓటు వేయండి' అని ఆయన అన్నారు.
Pics: టిఆర్ఎస్లో కృష్ణా యాదవ్
మోరీలో వేసినట్లే...
గతంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం కూర్చుని గబ్బు పట్టిచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నాగోల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో ఆయన ఆయన ఆ విధంగా అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇంటింటికి తిరుగుతూ మీ ఓటు మాకు గుద్దండంటే మాకు గుద్దండని అడుక్కుంటున్నాయని, గత 60 ఏళ్లుగా మీరు వాళ్లకు గుద్దుతున్నారని, వాళ్లు మిమ్మిల్ని గుద్దుతూనే ఉన్నారని ఆయన అన్నారు.
ఇంకా చాలు, వాళ్లతో గుద్దించుకోవద్దని, గులాబీని ముద్దిచ్చుకోండి అని, వాళ్లకు గనుక ఓటు వేస్తే మోరిలో వేసినట్టేనని, ఎందుకు పనికిరాకుండా పోతుందని అన్నారు. నగరాభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండని విజ్ఞప్తి చేశారు.
ఇంతకు ముందు జరిగిన ఏ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదని తెలిపారు. కానీ ఇప్పుడు వంద సీట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మనతో అందరూ కలిసి వస్తున్నారని తెలిపారు. సీమాంధ్ర సోదరసోదరీమణులు కూడా మనకు అండగా ఉన్నారని వివరించారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని వారు కూడా గ్రహించారని అన్నారు.
వారి ముచ్చట తీరుద్దాం...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత తెలంగాణ న్యాయవాదులకు అప్పగిస్తున్నానని కెటి రామారావు అన ్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను వంద సీట్లలో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లలో గెలిస్తే తాము రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని పిచ్చిపిచ్చి వాగ్దానాలు చేస్తోన్న టీడీపీ నేత రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీల ముచ్చట తీర్చుదామన్నారు.
మనం వంద సీట్లలో గెలిస్తే వాళ్లు రాజకీయ సన్యాసం స్వీకరించి ఇంట్లో కూర్చుంటారని మన ప్రభుత్వం తన పనులు తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు. ఇవాళ అంబర్పేటలోని ఫంక్షన్ హాల్లో తెలంగాణ న్యాయవాదులు నిర్వహించిన న్యాయవాదుల శంఖారావం సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.