కొడుకు దొంగిలించిన వస్తువులకు తల్లి మార్కెటింగ్
హైదరాబాద్: కన్న కొడుకు దొంగగా మారితే మందలించి మంచి మార్గాన పెట్టాల్సిన ఓ తల్లి.. అతడ్ని ప్రోత్సహించడమేగాక, అతడు దొంగిలించిన వస్తువులను అమ్మి డబ్బు సంపాదించేందుకు అలవాటుపడింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు.
ఆ తల్లిని అరెస్ట్ చేసి, ఆమె వద్ద గ్యాస్ పొయ్యి, వాషింగ్ మెషీన్, 4 ఎల్సిడీలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మోయిన్బాగ్ ఫతేషానగర్ ప్రాంతానికి చెందిన షాహీదా బేగం(55), ఉస్మాన్ ఖాన్ దంపతులకు హబీబ్ ముస్తాఫా (30) సంతానం. ముస్తాఫా గత నాలుగైదు నెలలుగా స్థానికంగా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు.
దొంగలించిన వస్తువులను తల్లి షాహీదా బేగం ద్వారా విక్రయిస్తున్నాడు. ఇదే క్రమంలో హబీబ్ ముస్తాఫా దొంగలించిన గ్యాస్, వాషింగ్ మిషీన్, నాలుగు ఎల్సీడీలను స్థానికులకు విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు.
వస్తువులను విక్రయిస్తున్న షాహీదా బేగంను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాల విషయాన్ని బయటపెట్టింది. దీంతో ఆమె వద్దనున్న గ్యాస్, వాషింగ్ మిషీన్, 4ఎల్సీడీలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కాగా, ముస్తాఫా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.