నకిలీ తాళం చెవులు చేయించి ఎటిఎం చోరీ (ఫొటోలు)
హైదరాబాద్: ఏటిఎం మిషన్ నుంచి డబ్బులు దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి వెంకటేశ్వరరావు, ఏసిపి వెంకటేశ్వర్లు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మెదక్ జిల్లా తోగుంట మండలానికి చెందిన మారెడ్డి సుధీర్రెడ్డి (23) నగరంలోని బికె గూడలో నివాసం ఉంటున్నాడు. ఇతను ఏటిఎం సెంటర్లలో నగదు నింపే బ్రింక్స్ సెక్యూరిటీ సంస్థలో కొంత విధులు నిర్వహించి ఆ తర్వాత మానేశాడు. ఇతని స్నేహితుడు ఎల్లారెడ్డి కూడా నగరంలోని మరో సంస్థలో ఇదే తరహా ఉద్యోగం చేస్తున్నాడు.
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశ కలిగిన సుధీర్ రెడ్డి తాను పనిచేస్తున్న సమయంలోనే ఆనంద్నగర్ కాలనీలోని ఏటిఎం మిషన్ తాళాలను నకిలీవి తయారు చేయించాడు. ఈ విషయాన్ని ఎల్లారెడ్డికి చెప్పడంతో అతను దానికి అంగీకరించాడదు. కారుడ్రైవర్ భాస్కర్తో కలిసి డబ్బును దొంగిలించేందుకు వ్యుహరచన చేశారు.

ముందుగా వేసుోకున్న పథకం ప్రకారం గత 28వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండే ఆనంద్నగర్ కాలనీ ఏటిఎంలోకి ఎల్లారెడ్డి, భాస్కర్ ముసుగులు ధరించి ప్రవేశించారు. తాళాలు తీసిన అనంతరం పాస్వర్డ్ కోసం సుధీర్రెడ్డికి ఫోన్ చేసి పాస్వర్డ్ తీసుకొని ఎంటర్ చేయగానే మిషన్ తెరుచుకుంది. వెంటనే అందులోని 11,94,500 నగదును దొంగిలించుకొని పారిపోయారు.
ఈనెల 1న బ్రింక్స్ సంస్థ ఉద్యోగులు సదరు ఏటిఎంలో నగదును నింపేందుకు వచ్చినప్పుడు లెక్కలో తేడా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని సంస్థ ఉన్నతాధికారులకు చెప్పారు. వారు పరిశీలించి దొంగతనం జరిగినట్టు నిర్ధారించుకొని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అయితే ముఖాలకు ముసుగులు ధరించడంతో వారిని గుర్తించడం కష్టమైంది. దాంతో పలుమార్లు సిసి ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు చోరీ చేసే సమయంలో నిందితులు ఫోన్లో మాట్లాడిన విషయాన్ని గుర్తించారు.
టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో ఆ ప్రాంతం నుంచి ఎవరెవరికి ఫోన్లు పోయాయో గుర్తించి సుధీర్తో మరో వ్యక్తి ఫోన్లో మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అతన్ని అదుపులోనికి తీసుకొని విచారించారు. దాంతో అతను తమ ముగ్గురూ కలిసి చేసిన దొంగతనం గురించి వెల్లడించాడు. మరో ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ. 11లక్షల 70 వేలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.












Click it and Unblock the Notifications