కాంగ్రెస్ పార్టీ లేకుండా మూడో కూటమా.?మమత చర్యలు హాస్యాస్పదం.!భగ్గుమన్న తెలంగాణ పీసిసి.!
ముంబాయి/హైదరాబాద్ : దేశంలో బీజేపియేతర మూడో కూటమి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం భావసారూప్యత ఉన్న రాజకీయ పార్టీలతో మంతనాలు కూడా మొదలెట్టేసారు దీదీ. కానీ ఈ సారి మమతా బెనర్జీ తృతీయ కూటమికోసం చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే హంసపాదులా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో బీజేపిని ఎదుర్కొనేందుకు జట్టు కడుతున్న రాజకీయ పార్టీలకు పెద్దన్నగా భావించే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎలా సాధ్యమనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లేని మూడో కూటమికి చేస్తున్న ప్రయత్నాలు అసలు ఫలించవని దీదీకి హితవు పలుకుతున్నారు కాంగ్రెస్ నేతలు.
బీజేపియేతర ప్రభుత్వం రావాలి.. ప్రయత్నాలు మొదలు పెట్టిన మమత
దేశంలో యూపీఏ కూటమి లేదు, మరొ కూటమి కోసం ప్రయత్నాలు చేద్దామంటున్న మమతా బెనర్జీ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ (యూపీఏ) ఆవశ్యకత లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసారు. దేశ ఆర్ధిక రాజధాని ముంబాయి పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ మూడో కూటమి, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం మీద చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నయి. బీజేపిని నిలవరించాలంటే కూటమిగా ఏర్పడాలి కానీ కాంగ్రేసేతర కూటమి అంటే ఎలా అని, అది మళ్లీ బీజేపికే కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు.. యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించిన దీదీ
ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్సీపీ నేత శరద్ పవార్తో బుధవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడారు. తాము పలు కీలక అంశాలపై చర్చించామని, భావ సారుప్యత ఉన్న అన్ని పార్టీలు ఏకమైతే బీజేపీకి ప్రత్యామ్నయ కూటమిగా ఏర్పడి ఓడించవచ్చని పేర్కొన్నారు. భాగసామ్య కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారనే విషయం చర్చకు రాలేదని తెలిపారు. బీజేపీ వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీని ఆహ్వానిస్తున్నామని శరద్ పవార్ చెప్పారు. అన్ని పార్టీలు కలిసికట్టు ఉండి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదామని శరద్ పవార్ తెలిపారు.
శరద్ పవార్ తో కీలక చర్చలు.. మరిన్ని చర్చలు అవసరమన్న పవార్..
శరద్ పవార్ను యూపీఏ చైర్పర్సన్గా ప్రకటించాలా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ప్రస్తుతం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్(యూపీఏ) ఉందా? ఇప్పుడైతే దేశంలో యూపీఏ లేదని అన్నారు దీదీ. అయతే, తాము మరో ప్రత్యామ్నయ భాగాస్వామ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంగళవారం మమతా శివసేన నేతలు సంజయ్రౌత్, సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక మమతా బేనర్జీ 2024 ఎన్నికల్లో పలు పార్టీలను ఏకంచేసి బీజేపీని ఓడించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్ లేకుండా మూడో కూటమిని ఊహింలేం.. దీదీ ప్రయత్నాలు బీజేపికి మేలు చేస్తాయన్న మల్లు రవి
ఇదిలా ఉండగా బీజేపీని గద్దె దించాలంటే బీజేపీ యేతర పక్షాలు అన్ని కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని, కాంగ్రెస్ పార్టీ దేశం అంత విస్తరించిన పార్టీ అని, అన్ని రాష్ట్రాలలో ఉన్న పార్టీ అని, కాంగ్రెస్ ను విమర్శించి, యూపీఏ ఉనికి ని ప్రశ్నిస్టే అది బీజేపీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత మల్లు రవి తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే టీఎంసీ, ఆప్ లాంటి పార్టీలు కాంగ్రెస్ కు అండగా నిలబడాలని, రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్, యుపిఎ మాత్రమేనని మల్లు రవి స్పష్టం చేసారు. కాంగ్రెస్ తో కాకుండా మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడితే అది బీజేపీకి మరోసారి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ లేకుండా తృతీయ కూటమి కోసం దీదీ చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదం అన్నారు.