Vijayamma ఎమోషనల్ స్పీచ్: నాడు జగనన్న బాణంగా - నేడు రెండు రాష్ట్రాల కోసం: ఇది దైవ నిర్ణయమేమో..!
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో విజయమ్మ కీలక ప్రసంగం చేసారు. ఆసక్త కర అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్ పేరును కొందరు ఓన్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని..నిజంగా ఆయన పైన అంత ప్రేమ ఉంటే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చారంటూ విజయమ్మ ప్రశ్నించారు. ఆయన కుటుంబాన్ని ఎందుకు రోడ్డు మీదకు తెచ్చారని నిలదీసారు.ఇది లోకమంతా తెలిసిన విషయమేనని చెప్పుకొచ్చారు. నాయకుడు అంటే భరోసా..ఆప్యాయత-ఆత్మీయత పంచేవాడై ఉండాలని..తన వారికి న్యాయం చేస్తారనే నమ్మకం కలిగించాలని చెప్పుకొచ్చారు.

షర్మిల-జగన్ వాళ్ల నాన్న వారసులు..
షర్మిల తన రాజకీయ రంగం ప్రవేశం పైన ప్రకటన చేసిన తరువాత ఈ మూడు నెలల్లో షర్మిల పైన దుష్ప్రచారం జరిగిందన్నారు. జగన్ - షర్మిల ఇద్దరూ వాళ్ల నాన్నకు వారసులంటూ విజయమ్మ చెప్పారు. కానీ, ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు రాస్ట్రాలకు ప్రతినిధులని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నామని..ప్రజా హితం కోసమని అనుకుంటున్నామని ఉబికి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ చెప్పారు. ఈ రోజు నుండి తెలంగాణలో కొత్త తరహా రాజకీయం మొదలవుతుందన్నారు. మరణం లేని నాయకుడు వైఎస్సార్ అని చెబుతూ..సింహం లాంటి నాయకులకు అడ్డులేదన్నారు.

షర్మిలకు రాజకీయాలు అవసరం లేదు..
వైఎస్ కల అసంపూర్తిగా మిగిలిపోయిందని..తెలంగాణ గడ్డ మీద షర్మిల అసలైన నాయకురాలుగా చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో పుట్టలేదనే వివాదానికి తావే లేదన్నారు. మీ రాజన్న ముద్దు బిడ్డ..వాళ్ల నాన్న అంటే ప్రాణం..లోకం గా బతికారని..వైఎస్సార్ యువరాణిలా పెంచుకున్నారంటూ వివరించారు. రాజకీయాల్లోకి రావాలనే అవసరం లేదని..వాళ్ల నాన్న కలలు..ఆశయం పూర్తి చేయాలనే వచ్చారని చెప్పారు.

అన్న అడిగితే 3200 కిలో మీటర్ల పాదయాత్ర..
అన్న జగన్ పాదయాత్ర చేయాలని కోరితే..జగనన్న బాణంగా వచ్చిందని గుర్తు చేసారు. 3200 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. ఆ రోజున్న పరిస్థితులు తలచుకుంటే బాధ కలుగుతుందన్నారు. ఒక బిడ్డను అక్రమంగా జైల్లో పెట్టారు.. మరో బిడ్డ ప్రజల మధ్యలో నిలిచిన రోజులని ఉద్వేగానికి లోనయ్యారు. అలా షర్మిలను రోడ్డు మీదకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందని..52 డిగ్రీల ఎండ..వాన..చలి పాదయాత్ర ఆపలేక పోయాయని వివరించారు.
Recommended Video

రాజన్న రాజ్యం తెలంగాణ జన్మ హక్కు
మాట ఇస్తే ఎందాకైనా వైఎస్సార్ నుండి నేర్చుకున్న పాఠం షర్మిల అనుసరిస్తారని చెప్పారు. నాడు జగన్ కోసం పాదయాత్ర చేస్తే..నేడు తండ్రి కోసం మీ ముందుకు వస్తోందన్నారు. మీకు తోడుగా.. మీ కుటుంబ సభ్యురాలిగా ఉంటుందన్నారు. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మ హక్కు. తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్ కోసం ..మీ చేయి ఊతం కావాలని విజయమ్మ కోరారు. ఇక, రెండు రాష్ట్రాల్లోనూ మనం తెలుగు వాళ్లం..తెలుగు రాష్ట్రాల మధ్య అభిప్రాయ బేధాలు రావచ్చు..సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications