ఈ పరిస్థితి ఏ విద్యార్థికి రావద్దు..కాలేజ్ యాజమాన్యంపై ఆత్మహత్యకు పాల్పడిన ఐశ్వర్యా తల్లి స్పందన
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజీలో బిఎస్సి సెకండియర్ చదువుతున్న ఐశ్వర్య రెడ్డి ఆత్మ హత్య వ్యవహారంలో కళాశాల యాజమాన్యం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కాలర్ షిప్ రాకపోవడం, హాస్టల్ ఖాళీ చేయాల్సిన పరిస్థితులు, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు వెరసి తెలంగాణా రాష్ట్ర రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన టాప్ స్టూడెంట్ ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా కళాశాల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లేడీ శ్రీరాం కాలేజ్ విద్యార్థిని షాద్నగర్లో ఆత్మహత్య.. లేఖలోకారణాలు
కళాశాల యాజమాన్యం తప్పేమీ లేదన్న తల్లి
ఈ క్రమంలో ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య విషయంలో ఆమె తల్లి కీలక విషయాలను వెల్లడించారు. కళాశాల యాజమాన్యం తప్పేమీ లేదని ఆమె పేర్కొన్నారు. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపోక తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మీడియా సమావేశంలో ఆమె స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో తాను ఇంటికి వచ్చిందని, ఈ క్రమంలో హాస్టల్ ఖాళీ చేయాలని సమాచారం అందడంతో, ఢిల్లీ వెళ్లడానికి కూడా డబ్బులేని ఆర్థిక పరిస్థితులు మానసికంగా కృంగదీశాయి అని ఐశ్వర్య తల్లి పేర్కొంది.
అప్పుల వాళ్ళ ఇబ్బంది , హాస్టల్ ఖాళీ చెయ్యటానికి వెళ్లేందుకు కూడా డబ్బులు లేక
ఇంట్లో ఆర్థిక అంశాలపై చర్చ జరగడం, లాక్ డౌన్ కారణంగా కుటుంబ ఆర్ధిక పరిస్థితి మరింత దయనీయంగా తయారుకావడం, అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరగడం వంటి కారణాలు తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి అని ఐశ్వర్య రెడ్డి తల్లి పేర్కొంది. ఐశ్వర్య రెడ్డి చదువు కోసం ఇంటి లోన్, గోల్డ్ లోన్ కూడా తీసుకున్నామని, ఇప్పటివరకు నాలుగు లక్షల రూపాయలు తన చదువు కోసం ఖర్చు చేశామని చెప్పారు తల్లి. ఐశ్వర్య చావుకు తమ ఆర్థిక పరిస్థితులే కారణమని, అంతే తప్ప కళాశాల యాజమాన్యం తప్పు ఏమీ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు సహాయం చేస్తే ఐశ్వర్య సోదరిని బాగా చదివిస్తామని ఆమె తెలిపారు.
ఆర్ధిక నిస్సహాయత కారణంగా ప్రాణాలు తీసుకున్న టాప్ స్టూడెంట్
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలలో ఒకటైన ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రజలను, విద్యావేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో విద్యార్థి తన ఆర్థిక నిస్సహాయతను స్పష్టంగా పేర్కొంది. ఆమె చదువుకోవాలనే తన తాపత్రయం అంతా సూసైడ్ నోట్లో రాసింది. చదువు లేకుంటే బ్రతకలేను అంది . ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆమె కలలు చెదిరిపోయాయి. ఆమె ల్యాప్టాప్ కూడా కొనుక్కోలేని దయనీయమైన పరిస్థితిలో చివరికి తనువు చాలించింది.