ఓ మహిళ ఫోన్ చేసి బెదిరిస్తోంది: విహెచ్, 'పవన్ కళ్యాణ్ ప్రచారానికొస్తే భయపడొద్దు'
హైదరాబాద్: తనను ఓ మహిళ ఫోన్ ద్వారా బెదిరిస్తోందని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత వి హనుమంత రావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సంజనా చౌదరి అనే మహిళ తనకు ఫోన్ చేశారన్నారు.
స్వర్గీయ ఇందిరా గాంధీని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలే కుట్ర పన్ని చంపించారని మాట్లాడిందని, అలాంటి వ్యక్తులకు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరెస్సెస్, బిజెపిలే ఇలాంటి ప్రచారానికి పూనుకుంటున్నాయని, అందులో వాస్తవం లేదని నేను చెప్పానని విహెచ్ పేర్కొన్నారు.
దీంతో, సదరు మహిళ తనతో వాగ్వాదానికి దిగిందన్నారు. తాను ఫోన్ కట్ చేయగా మళ్లీ మళ్లీ కాల్ చేసిందని, దీంతో తాను ఫోన్ స్విచ్ఛాఫ్ చేశానని చెప్పారు. తనను బెదిరించిన మహిళ పైన చర్యలు తీసుకోవాలని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు.
'పవన్ కళ్యాణ్ ప్రచారానికొస్తే భయపడం'
జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే భయపడాల్సిన అవసరం లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం ఆమె తెలంగాణ భవన్లో నిజామాబాద్ జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆంధ్రవారి ఓట్ల కోసం బిజెపి - టిడిపి కూటమి పవన్ కళ్యాణ్ను ప్రచారానికి ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
హైదరాబాద్కు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకువస్తే సంతోషిస్తామని, బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే వీలైనన్ని ఎక్కువ నిధులు తెప్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు.