అడిగినంత చందా ఇవ్వలేదని గ్రామం నుంచి మూడు కులాలు బహిష్కరణ
హైదరాబాద్: గుడి నిర్మాణానికి అడిగినంత చందా ఇవ్వలేదని గ్రామంలోని మూడు కులాలను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామంలో గంగామాత ఆలయం నిర్మించాలని గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ఒక్కో కుటుంబం తమ వంతుగా రూ. 500లను గుడి నిర్మాణం చందాగా ఇవ్వాలని ఆదేశించింది. దీంతో విశ్వబ్రాహ్మణ, పద్మశాలీ, మాల కులస్తులు అంత చందా ఇవ్వలేమని చెప్పారు.
దీంతో ఆగ్రహించిన గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, వీరిని సాంఘికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామంలోని మిగతా కులాల వారు వీరితో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు, సంబంధాలు పెట్టుకోరాదని ఆదేశించారు. గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పింఛన్ ఇప్పిస్తామని చెప్పి వృద్ధ మహిళ నుంచి బంగారం చోరీ
ఫించన్ ఇప్పిస్తామని చెప్పి వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నిందితులు వృద్ధ మహిళల నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ ఘటన మంగళవారం వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బండపల్లికి చెందిన రామనర్సవ్వకు పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ గుర్తు తెలియని వ్యక్తి అంగడి బజార్లోని ప్రభుత్వాస్పత్రి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలను లాక్కొని పారిపోయాడు.
మరో ఘటనలో అదే మండలంలోని చుంచనకోట గ్రామానికి చెందిన ఎంకవ్వ అనే వృద్ధురాలిని ఒక వ్యక్తి పింఛన్ ఇప్పిస్తానని చెప్పి సబ్రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చి బంగారం లాక్కొని పారిపోయాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.