రెస్క్యూ హోంలో ముగ్గురు యువతుల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాంగణంలో ఉన్న రెస్క్యూ హోం, స్టేట్హోంలలో నివాసముంటున్న ముగ్గురు బాలికలు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ నెల 3వ తేదీ ఉదయం ఇదే హోమ్నుంచి పదకొండు మంది యువతులు పరారైన సంఘటన తెలిసిందే.
తీవ్ర యువతుల ఆత్మహత్యాయత్నం సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి - నల్లగొండ జిల్లా 15 ఏళ్ల బాలిక, మెదక్ జిల్లా మన్నూరు మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక, ఖమ్మం జిల్లా గార్లమండలం, ముత్తితాండకు చెందిన 15 ఏళ్ల బాలిక కొంతకాలంగా స్టేట్ హోంలో ఉంటున్నారు. వీరు గత వారం రోజుల కిందట అధికారులు, వాచ్మన్ల కళ్లు గప్పి ఇక్కడి నుంచి పారిపోయారు.
అయితే పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఎట్టకేలకు మళ్లీ తీసుకువచ్చి స్టేట్ హోంకు అప్పగించారు. రెస్క్యూహోంలో ఉన్న ఇద్దరు బాలికలు గుర్తుతెలియని టాబ్లెట్లను మింగగా, స్టేట్హోంలో ఉన్న బాలిక సర్ఫ్ కలిపిన నీటిని తాగినట్లు తెలిసింది. విషయం గమనించిన కొందరు బాలికలు స్టేట్హోం ఇన్చార్జి నిర్మలకు సమాచారమిచ్చారు.
వెంటనే ఆమె పై అధికారులకు సమాచారం అందించి, వారి సూచన మేరకు బాలికలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యానికి బాలికలు సహరించలేదు, తాము రెండే టాబ్లెట్లు తీసుకున్నామని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న సంజీవరెడ్డినగర్ డికెట్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్, ఇతర అధికారులు స్టేట్హోంకు చేరుకుని రీజినల్ జాయింట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పద్మావతిల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాలికలు తాము స్టేట్హోం, రెస్క్యూ హోంలో ఉండడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు యత్నించామని, కోర్టు వాయిదాలు ఉన్నప్పటికి తీసుకువెళ్లడం లేదని చెప్పినట్లు సమాచారం.