తెలంగాణలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు: మొత్తం కేసులు 44కి చేరిక
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలోనూ కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 3 ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
గడిచిన 24 గంటలలో 20,576 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 109 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,80,662కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా బారిన పడి ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4022కి చేరింది.
శనివారం 190 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3167 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 248 మంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ క్రమంలో వారి నమూనాలను జీనోమ్ సీక్వీన్సింగ్ కోసం పంపారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కు చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినవారిలో ఇప్పటి వరకు 10 మంది కోలుకున్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణలోకి ఎట్ రిస్క్ దేశాల నుంచి 11,493 మంది ప్రయాణికులు వచ్చారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసులు 400 దాటిని విషయం తెలిసిందే.