Thummala Nageswara Rao : పార్టీ మార్పు ప్రచారంపై తుమ్మల నాగేశ్వరరావు రియాక్షన్...
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారం టీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా ఆయన పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనట్లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తుమ్మల పార్టీ మారబోతున్నారంటూ కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తుమ్మల నాగేశ్వరరావు దానిపై స్పందించారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని అన్నారు. నీతి,నిబద్దతతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని... తన ప్రయాణం కేసీఆర్తోనే అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్దికి తాను కృషి చేశానని చెప్పారు. జిల్లాకు సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని పేర్కొన్నారు.
2014లో టీడీపీ నుంచి ఖమ్మం బరిలో నిలిచిన తుమ్మల ఆ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి కాలంలో టీడీపీ నుంచి తుమ్మల,కాంగ్రెస్ నుంచి అజయ్ కుమార్ టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నేతలందరినీ కేసీఆర్ పార్టీ వైపుకు తిప్పుకున్నారు. ఈ క్రమంలో తుమ్మలకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కట్టబెట్టారు. 2016లో పాలేరు అసెంబ్లీ ఉపఎన్నికలో తుమ్మల గెలుపొందారు. కానీ ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత కొద్ది నెలలకే ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అప్పటినుంచి నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి,తుమ్మల వర్గీయుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఉపేందర్ రెడ్డి వర్గానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తోందని... తమను పట్టించుకోవట్లేదని తుమ్మల వర్గం అసంతృప్తిలో ఉంది. నియోజకవర్గ పార్టీ కమిటీల్లోనూ తమకు అన్యాయం జరిగిందని అప్పట్లో తుమ్మల వర్గీయులు ఆరోపించారు. ఒకానొక దశలో ఉపేందర్ రెడ్డిపై తుమ్మల కేసీఆర్కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.
కొద్ది నెలల క్రితమే తెలంగాణలో ఎమ్మెల్యే కోటా పరిధిలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గతంలో ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్.. ఈసారి కూడా తనకు అవకాశం ఇస్తారని తుమ్మల ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో తుమ్మలకు ఎమ్మెల్సీ దక్కేది లేనిది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే తుమ్మల పార్టీ పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది. ఇదే క్రమంలో ఆయన పార్టీ మారబోతున్నట్లు ఊహాగానాలు తెర పైకి వచ్చాయి.












Click it and Unblock the Notifications