కేసీఆర్ను ప్రతివాదిగా పేర్కొంటూ హైకోర్టులో తుషార్ పిటిషన్: నందకుమార్ విచారణ
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి పిటిషన్ వేశారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా తుషార్ పేర్కొన్నారు.
కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని తుషార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్ 21న విచారణకు రావాలని 16న 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చారని తెలిపారు. అనారోగ్యం కారణంగానే వైద్యుల సూచన మేరకు 2 వారాల గడువు కోరుతూ మెయిల్ చేసినట్లు చెప్పారు. అయితే, తన మెయిల్ కు సమాధానం ఇవ్వకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమే అవుతుందని పిటిషన్లో తుషార్ పేర్కొన్నారు.
5 గంటలపాటు నందకుమార్ విచారణ
ఎమ్మెల్యేల ఎరకేసులో నిందితుల్లో ఒకడైన నందకుమార్ ను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. కస్టడీ మొదటి రోజు ఐదున్నర గంటలపాటు.. న్యాయవాది నాగరాజు సమక్షంలో నందకుమార్ ను పోలీసులు విచారణ చేపట్టారు. ఫిలింనగర్లోని దక్కన్ కిచెన్ స్థలాన్ని సబ్ లీజుకు ఇచ్చి డబ్బులు వసూలు చేశారన్న కేసు దర్యాప్తులో భాగంగా నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో చంచల్గూడ జైలులో ఉన్న నందకుమార్ ను.. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చి విచారించారు. దక్కన్ కిచెన్ స్థలం, లీజ్, సబ్ లీజుకు సంబంధించి నందకుమార్ ను ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలు, లీజ్ అగ్రిమెంట్ విషయాలపై విచారించారు. తొలి రోజు విచారణ అనంతరం నందకుమార్ ను తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. మంగళవారం మరోసారి నందకుమార్ను ప్రశ్నించనున్నారు.