Viral Video: పీక్కు తింటున్న పెద్దపులి.. అర్ధరాత్రి వేట!
జగిత్యాల జిల్లాలో గత 25 రోజులుగా సాగుతున్న 'పులి' వేటలో ఎట్టకేలకు ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల్లో పశువుల మీద దాడి చేస్తున్న ఆ క్రూర మృగం.. చివరకు అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కింది. కొడిమ్యాల మండలం గంగారం తండా సమీపంలో పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో, ఇప్పటివరకు కేవలం ప్రచారమే అనుకున్న స్థానికులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు.
గంగారం తండాలో వరుసగా పశువులపై దాడులు చేస్తూ.. లేగదూడను, సుడి ఆవును చంపేసిన ఘటనలతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను కనిపెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పులి దాడి చేసిన ప్రదేశంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చనిపోయిన ఆవు మృతదేహాన్ని అక్కడే వదిలేశారు. అధికారులు ఊహించినట్లుగానే.. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఆకలితో ఉన్న పెద్దపులి అక్కడికి చేరుకుంది. నిశ్శబ్దంగా వచ్చి చనిపోయిన ఆవు మాంసాన్ని తింటున్న దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా నిక్షిప్తమయ్యాయి.

నిర్ధారణ కావడంతో పెరుగుతున్న ఆందోళన
ఇన్నాళ్లూ అడుగు జాడలను బట్టి పులి అని భావించిన అధికారులకు, ఇప్పుడు దృశ్యరూపంలో ఆధారాలు లభించడంతో అధికారికంగా ధృవీకరించారు. "పెద్దపులి సంచారం వాస్తవమే.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి" అని అటవీశాఖ ఉన్నతాధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ముఖ్యంగా గంగారం తండా, దాని పరిసర గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావొద్దని, పొలాల వద్దకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
తదుపరి అడుగు.. పట్టుకోవడమే లక్ష్యం!
పెద్దపులి సంచారం ఖరారు కావడంతో ఇప్పుడు దాన్ని సురక్షితంగా పట్టుకుని అడవిలోకి పంపడమే అధికారుల ముందున్న ప్రధాన సవాలు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మరిన్ని చోట్ల కెమెరా ట్రాప్లను పెంచడంతో పాటు, అవసరమైతే బోన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పులి ఒకే చోట స్థిరంగా ఉండకుండా తన స్థానాన్ని మారుస్తుండటం అధికారులకు సవాలుగా మారింది. ఏది ఏమైనా, జగిత్యాల అడవుల్లో తిరుగుతున్న ఈ 'చారల పులి' ఇప్పుడు జిల్లా ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది.












Click it and Unblock the Notifications