వ్యభిచార గృహాలు, విటులు టార్గెట్: చానెల్ ఎండి గుట్టురట్టు (పిక్చర్స్)
హైదరాబాద్: మీడియా ముసుగులో వ్యభిచార గృహాలను, విటులను టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఓ జూనియర్ ఆర్టిస్టును కిడ్నాప్ చేయడంతో వారి బాగోతం బయటపడింది. మీడియా ముసుగులో వ్యభిచార గృహ నిర్వాహకులు, విటులను బెదిరిస్తూ దోపిడీకి పాల్పడ్డారు.
ముట్టినదాంట్లో తమకు సహకరించిన సెక్స్ వర్కర్లకు వాటా ఇచ్చేవారు. ఈ ముఠాలో ఓ ఛానల్ ఎండీ, క్రైమ్ రిపోర్టర్, కెమెరామన్, సీఐడీ హోంగార్డు ఉన్నారు. కొద్ది రోజులు సాఫీగా సాగిన ఈ ముఠా దోపిడీ గుట్టు ఓ జూనియర్ ఆర్టిస్టును అపహరించడదంతో వారి వ్యవహారం వెలుగు చూసింది.
సెక్స్వర్కర్లతో జతకట్టి పెద్ద ఎత్తున దోచుకున్న 11మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 74 వేల నగదు, హ్యాండీ కెమెరా, స్టూడియో 9 న్యూస్ చానెల్ లోగో మైక్, ఫోర్ట్ ఫీస్టా, రెనాల్ట్ లార్డ్ కార్లు, బంగారు గొలుసు, 13 సెల్ఫోన్లు, బంగ్లాదేశ్కు చెందిన పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. గురువారం పశ్చిమమండలం డీసీపీ వెంకటేశ్వరరావు ఆ వివరాలను వెల్లడించారు.
చానెల్లో క్రైమ్ రిపోర్టర్
నల్గొండ జిల్లా గుండాలకు చెందిన మహ్మద్ జలీల్ హైదరాబాదులోని అంబర్పేటలో ఉంటూ ఓ న్యూస్ చానెల్లో క్రైం రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా ఘన్పూర్కు చెందిన గునిగంటి రాజు అదే చానెల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరికి సీఐడీలో హోంగార్డుగా పనిచేసే దిల్సుఖ్నగర్కు చెందిన ఈర్ల జగదీశ్వర్రెడ్డితో పరిచయం ఏర్పడింది.
ఆ ముగ్గురు కలిసి...
ఆ ముగ్గురు కలిసి తరచూ వ్యభిచార గృహాలకు వెళ్లేవారు. వీరికి లక్ష్మీదుర్గా, ప్రియలతో చనువు ఏర్పడింది. వీరంతా కలిసి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. జలీల్, జగదీశ్వర్రెడ్డి వ్యభిచార గృహాల నిర్వాహకులు విటులను బెదిరించి డబ్బు వసూలు చేయాలని పథకం వేశారు.
చానెల్ ఎండి ఇలా...
జలీల్ ఈ విషయాన్ని ఛానెల్ ఎండీ అయిన వరంగల్ జిల్లాకు చెందిన తవకం శివకుమార్కు చెప్పాడు. చానెల్ పెట్టి నష్టాల్లో ఉండటంతో శివకుమార్ వచ్చిన దాంట్లో తనకు భాగం ఇవ్వాలని చెప్పాడు. దీనిని జలీల్ అంగీకరించి తన పథకానికి తూర్పు సంజీవరెడ్డి, నకర కంతి మధు, షేక్ సలీంల మద్దతు తీసుకున్నాడు. వీరంతా కలిసి సెక్స్ వర్కర్ల నుంచి వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటుల ఫోన్ నంబర్లు తీసుకున్నారు.
న్యూస్ చాలెన్ పేరు చెప్పి...
వ్యబిచార గృహాలపై దాడి చేసి జగదీశ్వర్రెడ్డి తాను ఎస్ఐని అని చెప్పేవాడు. మిగతా వారంతా న్యూస్ చానెల్స్ రిపోర్టర్లమని బెదిరించి వసూళ్లకు పాల్పడేవాళ్లు. ఈ క్రమంలోనే కృష్ణానగర్లో నివాసం ఉండే జూనియర్ ఆర్టిస్ట్, వ్యభిచార గృహం నడిపే శ్రీనివాసరావులను బెదిరించి డబ్బు వసూలు చేశారు.