నిజామాబాద్ జిల్లాలో ఆదర్శరైతు తోటలో టాప్ హీరోయిన్ల సందడి ... మ్యాటర్ ఏంటంటే!!
సమంత, పూజా హెగ్డే, రష్మిక మందాన, తమన్నా ఇలా అందరు టాప్ హీరోయిన్లు ఒకేచోట కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలోని ఓ తోటలో ఇప్పుడు ఈ హీరోయిన్లంతా సందడి చేస్తున్నారు. స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే టాప్ హీరోయిన్లు అందరు నిజామాబాదులో తోటలో ఏం చేస్తున్నారబ్బా అని ఆలోచించే వారి కోసమే ఈ కథనం.
రైతు తోటలో టాప్ హీరోయిన్ల ఫోటోలు
అసలు మ్యాటర్ ఏంటంటే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపురం గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన పొలంలో టాప్ హీరోయిన్ల అందమైన ఫోటోలను పెద్ద పెద్ద పోస్టర్లు గా వేయించి ఏర్పాటు చేశారు. ఇప్పుడు శ్రీనివాస వేయించిన పోస్టర్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. వివిధ ఫోజుల్లో ఆకట్టుకునే రంగులతో ఆయన టాప్ హీరోయిన్ ల ఫోటోలు పొలంలో ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆయన చేసిన పని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.
నిజామాబాద్ రైతు ఆదర్శ వ్యవసాయం.. చుట్టూ ప్రక్కల గ్రామాల్లో అందరి దృష్టి ఆయన సాగుపైనే
శ్రీనివాస్ రెడ్డి 9 ఎకరాల్లో ఆదర్శ వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ప్రధానంగా బొప్పాయి పంటను వేశారు. బొప్పాయితో పాటుగా అంతరపంటగా బంతి, దానిమ్మ వంటి పూలు, పండ్ల పంటలు వేశారు. ఇక శ్రీనివాసరావు చేస్తున్న ఆదర్శ వ్యవసాయం ఆ చుట్టుపక్కల గ్రామాల వారందరినీ ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆయన వ్యవసాయం చేస్తున్న తీరు తెలుసుకోవడం కోసం ఆయన పంట పొలంలో కి వెళ్లి మరీ చూస్తున్నారు.
ఏపుగా పెరిగిన బొప్పాయి ఇస్తున్న దిగుబడులు, అంతర పంటలు ఇస్తున్న ఫలసాయం నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల వారు ఆయన సాగు తీరును తెగ మెచ్చుకుంటున్నారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు... హీరోయిన్ల ఫోటోలు పెట్టటానికి కారణాలు ఇవే
దీంతో శ్రీనివాస్ రెడ్డి నిత్యం అనేక మంది తన పంట పొలాల పైన దృష్టి పెట్టడంతో, దిష్టి తగులుతుందని భావించి దిష్టి తగలకుండా తోటలో అక్కడికి వచ్చే వారిని ఆకట్టుకునేలా అందమైన టాప్ హీరోయిన్ల ఫోటోలు పెట్టి తోట పై నుండి దృష్టి హీరోయిన్ల పై మళ్లేలా చేశారు. అంతేకాదు బొప్పాయి, దానిమ్మ వంటి పంటలకు పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పక్షులు రాకుండా కాపాడుకోవడానికి పంట పొలంలో మనుషులు ఉన్నట్లుగా అందమైన హీరోయిన్ల ఫోటోలను పొలంలో ఏర్పాటు చేసి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు జనాల దృష్టినుండి, పక్షుల బారినుండి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి.
శ్రీనివాస్ రెడ్డి ఐడియాకు జనం ఫిదా.. తోటకు టాప్ హీరోయిన్లు కాపలా అంటూ చర్చ
ఇక పొలం నిండా టాప్ హీరోయిన్ల ఫోటోలను ఏర్పాటు చేయడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బుర్రనిండా ఐడియాలున్న శ్రీనివాస్ రెడ్డి అద్భుతమైన, ఆదర్శవంతమైన వ్యవసాయ చేయడంతో పాటుగా, పంటను కాపాడుకోవడం కోసం చేసిన ఆలోచనకు జనం ఫిదా అవుతున్నారు. శ్రీనివాసరెడ్డి తోటకు టాప్ హీరోయిన్లు కాపలా ఉన్నారంటూ సరదాగా సంభాషిస్తున్నారు. సినిమాల ద్వారా అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న టాప్ హీరోయిన్లు, ఇప్పుడు పంట పొలాలను కాపాడడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నారు . ఏది ఏమైనా రైతు శ్రీనివాస్ రెడ్డి ఐడియా చూసినవారంతా వాట్ యాన్ ఐడియా శ్రీనివాస్ రెడ్డి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.