కేసీఆర్ తో రేవంత్ డైరెక్ట్ ఫైట్ - కామారెడ్డి లో పోటీ, అటు రాములమ్మ..!?
తెలంగాణ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ప్రధాన పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై కొత్త ఎత్తులతో సిద్దమవుతున్నాయి. హ్యాట్రిక్ లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అధికారం ఖాయమనే ధీమాతో కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. అటు బీజేపీ సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి ఈ సారి పోటీకి సిద్దమయ్యారు. కేసీఆర్ ను డైరెక్ట్ గా ఢీ కొట్టేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడీ అవుతున్నారు.
మారుతున్న లెక్కలు : తెలంగాణ ఎన్నికల్లో అనూహ్య నిర్ణయాలు తెర మీదకు వస్తున్నాయి. కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయం మొదలు పెట్టింది. బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్ 55 మంది తమ అభ్యర్దులను ప్రకటించింది. మిగిలిన జాబితా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. అటు బీజేపీ జాబితాపైన తుది కసరత్తు జరుగుతోంది.

ఈ సారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజక వర్గం గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయని వెల్లడించారు. రెండు నియోజకవర్గాల్లో గెలిచిన తరువాత ఏ స్థానంలో కొనసాగేది అప్పుడు నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలుకు చెబుతున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ లక్ష్యంగా కామారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కామారెడ్డి నుంచి రేవంత్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేరుడా ఢీ కొట్టేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. కొడంగల్ తో పాటుగా కామారెడ్డి నుంచి రేవంత్ బరిలోకి దిగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కామారెడ్డి నుంచి షబ్బీర్ పేరు లేకపోవటం చర్చకు కారణమైంది. సీనియర్లకు దాదాపు తొలి సాబితాలోనే ీసట్లు ఖరారు చేసిన కాంగ్రెస్ షబ్బీర్ పేరు మాత్రం ప్రకటించలేదు.
కామారెడ్డి తొలి నుంచి కాంగ్రెస్ కు అనుకూల నియోజకవర్గంగా ఉంది. షబ్బీర్ అలీ ఇక్కడి నుంచి రెండు సార్లు గెలిచి మంత్రి అయ్యారు. బీఆర్ఎస్ నుంచి గంపా గోవర్ధన్ మూడు సార్లు బీఆర్ఎస్, ఒక సారి టీడీపీ నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ నుంచి షబ్బీర్ 5,007 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో, ఈ సారి గెలుపు కోసం షబ్బీర్ చాలా రోజులుగా నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు.

టార్గెట్ కేసీఆర్..ముమ్మర రాజకీయం : అయితే, ఇక్కడ నుంచి రేవంత్ ను పోటీకి దింపి సీఎం కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వాలనేది తాజాగా కాంగ్రెస్ నిర్ణయంగా విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో బీజేపీ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ పైన పోటీకి దిగనున్నారు. హుజూరాబాద్ లోనూ పోటీలో నిలవనున్నారు.
దీంతో, ఇప్పుడు గజ్వేల్..కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారుతోంది. కొడంగల్ లో రేవంత్ ను ఓడించేలా ఇప్పటికే బీఆర్ఎస్ వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ సమయంలోనే కామారెడ్డి నుంచి రేవంత్ బరిలోకి దిగటం ద్వారా పార్టీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు కామారెడ్డి నుంచి కేసీఆర్, విజయశాంతి, రేవంత్ పోటీ ఖాయంగా కనిపిస్తున్న వేళ..ఇక్కడ రాజకీయం..ఫలితం ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications