తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు-ఆ తేదీ తర్వాత ప్రభుత్వ రద్దు-రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఓవైపు పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతూనే మరోవైపు ప్రత్యర్థులపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తనపై మంత్రులు కేటీఆర్,హరీశ్ రావు చేసిన విమర్శలకు తాజాగా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తాను టీడీపీ నేతను అని... కాంగ్రెస్లో చేరేముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు,తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'రాజీనామా' విమర్శలపై రేవంత్ రియాక్షన్...
తనపై విమర్శలు చేసేందుకు మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్ పోటీ పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.తనను టీడీపీ నేత అని విమర్శించేవారు... కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చారో ఒకసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని... తాను కాంగ్రెస్లో చేరేముందే టీడీపీకి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ఎమ్మెల్యేగా తాను పొందుతున్న జీతభత్యాలు,గన్మెన్లు,పీఏను ప్రభుత్వానికి సరెండర్ చేశానని చెప్పారు. అయితే అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి తన దృష్టిలో గుర్తింపు లేదు కాబట్టే తన రాజీనామా లేఖను ఆయనకు ఇవ్వలేదని అన్నారు.

బరాబర్ అధికారాన్ని గుంజుకుంటాం : రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ అయితే... టీఆర్ఎస్ కూడా టీడీపీనే అని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ కేబినెట్లో 75శాతం మంత్రులు టీడీపీ నుంచి వచ్చినవారే అన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని... బరాబర్ అధికారాన్ని గుంజుకుంటామని అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే ఎల్.రమణను పార్టీలో చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ లాగే... కాంగ్రెస్కు తాను అధ్యక్షుడినని చెప్పారు.

మళ్లీ ముందస్తు ఎన్నికలు : రేవంత్
తెలంగాణలో మళ్లీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అగస్టు 15,2022 తర్వాత కేసీఆర్ మరోసారి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని అన్నారు. కావాలంటే తన మాటలను రాసి పెట్టుకోవాలని సవాల్ విసిరారు. కేటీఆర్ను కేసీఆర్ ముఖ్యమంత్రి చేయరని వ్యాఖ్యానించారు. కాగా,రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్,హరీశ్ రావులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా విడుదలైనప్పుడు హడావుడి చేసే బ్యాచ్ ఒకటి ఉంటుందని... రేవంత్ రెడ్డి ఆ బ్యాచ్ను చూసి తానేదో ప్రధాని అయినట్లుగా ఫీలవుతున్నారని విమర్శించారు. అది కాంగ్రెస్ పీసీసీ కాదు టీడీపీ పీసీసీ అని బయట జోకులు వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమంటున్న రేవంత్ రెడ్డి... స్వయంగా డబ్బు సంచులతో వెళ్లి ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నించాడని... మరి ఆయన్ను కూడా రాళ్లతో కొట్టాలా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లినప్పుడు రేవంత్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
Recommended Video

రేవంత్ ముసుగులో చంద్రబాబు : హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టారని విమర్శించిన సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో గెలిచేందుకు ప్రయత్నించిన చంద్రబాబు... ఇప్పుడు కాంగ్రెస్లోకి తన మనుషులను పంపి వాళ్ల ముసుగులో మళ్లీ అడుగుపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్కు పీసీసీ ఇవ్వడం దీనికి సంకేతమన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ మంత్రి హరీశ్,కేటీఆర్లకు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications