మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ.!ఉప ఎన్నిక అంశంలో వేగం పెంచిన టీపిసిసి.!
మునుగోడు/హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని సమన్వయ కమిటీ సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేసారు. అధికార అహంకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాను గుప్పిట్లోకి తీసుకొని భయపెట్టో, ప్రలోభ పెట్టో, వారికి అనుకూలంగా ప్రచార ఆర్భాటం చేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత భావజాలమే ప్రజలను ఆకర్షిస్తుందని, పార్టీని గెలిపిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.
మునుగోడులో వేగం పెంచిన కాంగ్రెస్..
గత ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్, బిజెపిలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ మునుగోడు మండల కార్యకర్తల సమన్వయ సమావేశంలో సీనియర్ నాయకులు పాల్గొని ఉప పోరులొ పార్టీ విజయం పట్ల వ్యూహ రచన చేసారు.పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గాలంటే బిజెపిని ఓడించాలని, కాంగ్రెస్ ని గెలిపించాలని మునుగోడు ప్రజలకు సూచించారు.
దేశ సంపదను అమ్ముతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతృత్వ పోకడలతో దేశాన్ని ఏలుతున్న బిజెపిని మునుగోడులో ఓడించి ఇక ప్రజా వ్యతిరేక పాలన చాలు అన్న సందేశాన్ని మునుగోడు దేశానికి ఇవ్వాలని సూచించారు.
బీజేపి, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలన..
ధరల పెరుగుదలతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారే తప్పా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని టీపిసిసి నేతలు ప్రసంగించారు. కానీ మునుగోడు ప్రజలకు బ్రహ్మాస్త్రంగా ఉన్న ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 8సంవత్సరాలుగా తెలంగాణ సంపదను టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేయడమే కాకుండా ఐదు లక్షల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళ తీయించారని భట్టి విక్రమార్క మండి పడ్డారు. మిషన్ భగీరథ, చెరువుల పూడిక తీత పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రతి పౌరుడుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలసరి అప్పు 2.25 లక్షలు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అప్పుల తెలంగాణగా మార్చారు..
అప్పులు చేసి తెలంగాణను దివాలా తీయించడానికే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామా అని కాంగ్రెస్ నాయకులు మునుగోడు ప్రజలను ప్రశ్నించారు. ఎస్ఎల్బిసి టన్నెల్ సొరంగం పనులు పూర్తి చేయకుండా మునుగోడు ప్రాంతానికి నీళ్ళు రాకుండా అడ్డుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా నదిలో ఉన్న నీళ్లను పొలాల్లోకి గలగల పారించే వాళ్ళమని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల మనుగడ..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల వలె పని చేయాలని, కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయన్నారు కాంగ్రెస్ నేతలు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని, రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాలకు మునుగోడు ఉప ఎన్నిక దిక్సూచిగా మారాలని, మద్యం ప్రలోభాలకు ఓటును వృధా చేయొద్దని, ప్రజా సంక్షేమ రాజ్యానికే మునుగోడు ప్రజల ఓటును బ్రహ్మాస్త్రంగా ఉపయోగించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.