హడావుడి చేరికలు సరే.. మా మాట వినరా? టీపీసీసీలో సీనియర్ల లొల్లి
హైదరాబాద్: రాజకీయ నాయకులు డ్రెస్లు మార్చినంత తేలిగ్గా పార్టీ కండువాలను మార్చేస్తున్నారు. ప్రతి పార్టీలోనూ నాయకుల రాక పోకలు సాధారణమయ్యాయి. రాజకీయ పార్టీలు కూడా చేరికల్లో పోటీలు పడుతున్నాయి. నాయకుల రాకతో పార్టీలకు లాభ నష్టాలు ఉంటాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడీ చేరికలు తలనొప్పిగా తయారయ్యాయన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఒకే జిల్లాకు చెందిన నేతలు ఒకరికి తెలియకుండా మరొకరు పోటీపడి ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తుండడంతో వారి మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి.
చివరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డికి కూడా తెలియకుండా చేరికలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. గాంధీభవన్లో ఈ నెల రెండో తేదీన టీపీసీసీ కార్యవర్గ భేటీ సందర్భంగా జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనం అని అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జడ్పీటీసీ సభ్యురాలి చేరిక సంగతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణకు తెలియకుండా ఉంచడం గమనార్హం అని చెప్తున్నారు.
ఆహ్వానంతో ఆశ్చర్యపోయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
టీపీసీసీ కార్యవర్గ సమావేశ సమయంలోనే హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీకి చెందిన ఎంఐఎం మాజీ కార్పొరేటర్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అగ్ర నాయకులే సారథ్యం వహించారు. ఇక మహబూబ్నగర్ జిల్లా హన్వాడ జడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ, అమె కుమారుడు సురేందర్రెడ్డి చేరిక విషయం మాత్రం ఆ జిల్లాలోని ముఖ్య నేతలకు తెలియదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ కార్యవర్గ భేటీ జరుగుతున్న సమయంలోనే చేరిక సభ ఏర్పాటు చేసుకున్న కొందరు మహబూబ్నగర్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైందని సన్నిహితులు చెబుతున్నారు.
అరుణ అభిప్రాయాలను జైపాల్ రెడ్డి బేఖాతర్ చేశారా?
పార్టీలో ఇతర పార్టీల నేతల చేరికల తీరుపై టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీరియస్గా చర్చ జరిగింది. చేరిక జరుగుతున్న సమయంలో సీనియర్ నేత డి.కె.అరుణ లేకపోవడంపైనా చర్చించారు. ఈ చేరికపై ఆమె అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి నేతృత్వంలో ఈ చేరిక జరిగిందని చెబుతున్నారు. డి.కె.అరుణ అభ్యంతరాలను ఆయన పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా సమక్షంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.
అభ్యర్థుల నేపథ్యం, సమీకరణలపై ఫోకస్ చేయాలని సూచనలు
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారెవరో, వారి నేపథ్యం ఏమిటో తమకు తెలియకుండా పోతోందని సీనియర్ నేతలు వాపోతున్నారు. పత్రికల్లో చూస్తే తప్ప తమకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హడావిడి చేరికల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, అభ్యర్థుల నేపథ్యం, సమీకరణలపై చర్చ జరగాలని వారు సూచించినట్లు సమాచారం. అంతేకాక చేరికలపై ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉందని కూడా వాదించినట్లు తెలుస్తోంది. ఎవరెవరో అనామకులు ఢిల్లీ వెళ్లి కండువా కప్పుకొని రావడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని కూడా తెగేసి చెప్పినట్లు తెలిసింది. చేరికల విషయంలో సీనియర్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించినట్లు తెలిసింది. దీంతో కుంతియా, ఉత్తమ్, సీనియర్లు దీనిపై ఒక నిర్ణయానికి రావాలని నిశ్చయించుకున్నట్లు తెలిసింది.
10 వేల మందితో గోష్టి నిర్వహణ ద్వారా ఇలా అసమ్మతి స్వరం
కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పని చేస్తున్నా గుర్తింపు రావట్లేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరిస్థితి, అగ్ర నేతల తీరుపై ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కొందరు నేతలు ఇటీవల హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు వ్యవహార శైలిని తప్పుబట్టినట్లు సమాచారం.ఆయన కారణంగానే జేఏసీ, ఇతర పార్టీ నేతలకు ప్రాధాన్యం లభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థి, యువజన కాంగ్రెస్ పదవుల కోసం కూడా కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పది మందితో కూడిన బృందం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ను కలిసి పరిస్థితిని వివరించాలని నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల పాత విద్యార్థి, యువజన కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో 10వేల మందితో ఒక గోష్ఠి నిర్వహించాలని, దీనికి రాహుల్ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.