టీపిసీసీ పొలిటికల్ ఎఫైర్స్ జూమ్ మీటింగ్.!ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చ.!
హైదరాబాద్ : రాజకీయంగా ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఒదులుకోవద్దనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ముఖ్యనేతలు చర్చించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ నేతృత్వంలో జూమ్ ఆప్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు రావ్, పొన్నాల లక్ష్మయ్య, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, వర్కింగ్ ప్రసిడెంట్స్ జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రేణుక చౌదరి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాబోయే స్థానిక సంస్థల మండలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అంశాన్ని నాయకులు చర్చించారు. నల్గొండ విషయంలో సోమవారం సాయంత్రం జిల్లా నాయకులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేపటి లోగా అన్ని జిల్లాల నాయకులు చర్చించుకుని సమగ్ర సమాచారాన్ని పీసీసీ అధ్యక్షులకు, సీఎల్పీ నాయకులకు, మండలి ఎన్నికల కమిటీ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. అలాగే నవంబర్ 14 నుంచి చేయ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలు వారం రోజుల పాటు వాయిదా పడినందున ఆ సమయంలో జిల్లాలో డిజిటల్ మెంబెర్షిప్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అందుకు ఆయా జిల్లాల ఇంఛార్జీలుగా ఉన్న వర్కింగ్ ప్రసిడెంట్స్, వైస్ ప్రసిడెంట్స్ క్షేత్ర స్థాయిలో పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.