విషాదం ..ఇంటర్ లో ఫెయిల్ అయ్యిందని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణా రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో మరోమారు బాలికలదే పైచేయి అయింది. ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారు సంతోషంలో ఉండగా , మార్కులు తక్కువ వచ్చిన వారు, పాస్ అవుతామనుకున్నా ఫెయిల్ అయిన వారు చాలా బాధలో ఉన్నారు.
అయితే ఇంటర్ ఫలితాలలో ఫెయిలైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విద్యార్థిని ఆత్మహత్య తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది.
కోఠిలోని ప్రగతి మహావిద్యాలయంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అనామిక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిలైంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో తన పేరు కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలనే సీరియస్ నిర్ణయం తీసుకున్న అనామిక చివరకు తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది .