'బేగంపేట ఏర్ పోర్ట్ తెలంగాణకి దక్కకుండా కుట్ర': 'కెసిఆర్పై ఎమ్మెల్యేల తిరుగుబాటు'
హైదరాబాద్: భాగ్యనగరంలోని బేగంపేట విమానాశ్రయం తెలంగాణకు దక్కకుండా చేసే కుట్ర జరుగుతోందని టిఆర్ఎస్ ఆరోపించింది. ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గురువారం విలేకరులతో మాట్లాడారు. అశోక్ గజపతి రాజుకు విమానయాన శాఖపై అవగాహనలేదని, బేగంపేట విమానాశ్రయం తమకు దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నారు.
మాకు కేటాయించిన నీరు మేం వాడుకుంటున్నామని, హైకోర్టు తీర్పును ఏపీ పట్టించుకోవడం లేదన్నారు. మా నీళ్లు మే అడుగుతున్నామని ఎంపీ విశ్వేశ్వర రెడ్డి అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు సిఎం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
కెసిఆర్పై సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు: ఉత్తమ్
తెలంగాణ సీఎం కెసిఆర్ పైన సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తారని తెలంగాణ పిసిసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నారన్నారు. వారు తిరుగుబాటు చేస్తారన్నారు.
సొంత నియోజకవర్గంలో గెలిచే సత్తా కూడా లేనటువంటి నేతలు పార్టీ వీడటం వల్ల వచ్చే నష్టం కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదన్నారు. వరంగల్ లోకసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఉన్నామని చెప్పారు.
కార్మికుల సమస్యపై విహెచ్, భట్టి
కార్మికులు జీతాలు పెంచమని అడుగుతుంటే కేసులు పెట్టడం విడ్డూరమని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మానత్వం ఉన్న వారు ఎవరైనా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు.
ఎవరెవరికో వరాలు ఇస్తున్న కెసిఆర్ కార్మికులను ఎందుకు పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యుడు విహెచ్ ప్రశ్నించారు. రూ.లక్షలతో కార్లు కొన్న సర్కార్కు కార్మికుల సమస్యలు పట్టడం లేదన్నారు. మసీదుల వద్ద శుభ్రత లేకుంటే మజ్లిస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని 10 వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేశారు. వారు సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందన్నారు. కార్మికుల సమస్యలు తీర్చాలని బిజెపి డిమాండ్ చేసింది.