ఆదిపత్యం కోసమే టీఆర్ఎస్ బీజేపీల నాటకాలు.!డ్రామా రక్తి కట్టింది.!ఇక ఆపాలన్న చాడా.!
హైదరాబాద్ : రాష్ట్రంలో చోటుచేకున్న రాజకీయ పరిణామాలపై ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్దితులను విపక్షాలు లోతుగా గమనించినట్టు తెలుస్తోంది. రైతాంగ సమస్యల గురించిగానీ, వరి పంట గురించి గానీ, గులాబీ పార్టీ వంద నియోజక వర్గాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన దీక్షల గురించి గానీ ప్రతిపక్షపార్టీలు పెద్దగా స్పందించలేదు.
తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి నిల్వల తనిఖీల సందర్బంగా చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపైన విపక్షాలు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నాయి. జనసమితి అధినేత కోదండరాం బండి సంజయ్ తనిఖీలను తప్పబట్టగా తాజాగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా బీజేపి తనిఖీలను వ్యతిరేకిస్తున్నారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీల కార్యకర్తల పరస్పర భౌతిక దాడులతో వడ్ల కొనుగోలు అంశాన్ని పక్కదొవ పట్టిస్తున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
ఇరు పార్టీల మధ్య ప్రచ్చన్నయుద్దం ముదిరి ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్దంగా దాడులకు తెగబడటాన్ని చాడ వెంకటరెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. వారు చేసుకునే దాడులు రాజకీయ కోణంలోనే సాగుతున్నాయి తప్ప రైతులకు ఉపయోగపడడానికి ఏమాత్రం కాదని మండిపడ్డారు. ఇకనైన ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, దాడులు మాని యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం కేంద్రం మీద వత్తిడి తెచ్చి యాసంగిలో ధాన్యమంతటిని కొనుగోలు చేసేలా ఉత్తర్వులు తెప్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రస్తుతం అందుబాటులో వున్న వానా కాలం పంటను యుద్ధ ప్రాతిపధికగా కొనుగోలు చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఒకవైపు తుఫాన్ వచ్చి వర్షాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున రోడ్లపైన ఉన్న వడ్లను కొనుగోలు చేయడానికి సత్వరమే అదనంగా 7000 కేంద్రాలను పెంచాలని చాడ వెంకటరెడ్డి సూచించారు.