పాలమూరు రగడ: టీడీపీXటిఆర్ఎస్, జూపల్లి వెయిటింగ్, రావుల సై, కెసిఆర్పై లోకేష్ ఎద్దేవా
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం వైఖరి పైన టిఆర్ఎస్ నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లాకు చెందిన టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రాజ్ భవన్లో గవర్నర్ను కలిశారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. తమ పోరు చంద్రబాబు పైనే తప్ప ఏపీ ప్రజల పైన కాదన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే చంద్రబాబును తరిమి కొడతామని చెప్పారు. ఏపీ సర్కార్ కుట్రలను గవర్నర్కు వివరించామని చెప్పారు. ఓటుకు నోటు కేసు భయంతో పాలమూరు ఎత్తిపోతలను రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
కెసిఆర్ పైన నారా లోకేష్ ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ట్విట్టర్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ మిస్ గవర్నెన్స్, సామర్థ్యలేమి వల్ల ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ... జీరో బ్యాలన్స్కు తీసుకు వస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఆ తర్వాత తెలంగాణను దివాళా తీస్తారా అని ప్రశ్నించారు.
జూపల్లి నిరీక్షణ
పాలమూరు ఎత్తిపోతల పైన రావుల చంద్రశేఖర్ రెడ్డితో చర్చించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ కమిటీ హాల్కు వచ్చారు. సుమారు రెండు గంటల పాటు రావుల కోసం జూపల్లి వేచి చూశారు. రావుల రాకపోవడంతో జూపల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. చర్చల కోసం మరో 3 రోజుల పాటు అసెంబ్లీ కమిటీ హాలుకు వస్తానని తెలిపారు. బ్రహ్మదేవుడు ఎదురొచ్చినా పాలమూరు ఎత్తిపోతలను కట్టితీరుతామన్నారు. చంద్రబాబు దురుద్దేశంతో అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
చంద్రబాబు తీరుపై గవర్నర్కు ఈ ఉదయం ఫిర్యాదు చేశామన్నారు. రెండు రోజుల క్రితం రావుల చంద్రశేఖర రెడ్డి.. జూపల్లి వస్తానని చెప్పడంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నాలుగు గంటల పాటు నిరీక్షించిన విషయం తెలిసిందే.
రావుల కౌంటర్
నెట్టెంపాడుకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు లభించాయని రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. కోయల్ సాగర్ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలో ఆదేశాలిచ్చామని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జూపల్లితో తాను చర్చకు సిద్ధమని చెప్పారు.
అయితే, చర్చకు తేదీ, సమయం ఏకపక్షంగా నిర్ణయించారన్నారు. తొలుత ఓ ప్రాజెక్టుకు రూపాయి పెట్టలేదని సవాల్ చేసిన జూపల్లి ఆ తర్వాత మరోలా మాట్లాడారన్నారు. తాను చర్చకు సిద్ధమని చెప్పారు.
జూపల్లి తనకు తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వస్తానని చెప్పారని, ఆ తర్వాత ఆయన రాలేదన్నారు. పైగా, మెదక్ జిల్లా పర్యటనలో కనిపించారన్నరు. ఓ ప్రాజెక్టుకు ఒక్కరూపాయి ఖర్చు చేయలేదని చెప్పారని, చంద్రబాబు ఒక్కరూపాయి ఖర్చు చేశాడని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పారని, ఆ తర్వాత మాత్రం ఆయనే పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని చెప్పారన్నారు.