టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్య కేసులో మరో మలుపు: కాంగ్రెస్ హస్తం
వరంగల్: టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళీ మనోహర్(45) దారుణ హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. మురళి హత్య కేసులో పలువురు కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నట్లు తాజాగా పోలీసులు వెల్లడించడం గమనార్హం.

కాంగ్రెస్ నేతల హస్తం
ఈ హత్య కేసులో ఏ4 నిందితుడిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, ఏ5గా పోతుల శ్రీమాన్, ఏ6 కానుగంటి శేఖర్ పేర్లను పోలీసులు చేర్చారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా తాజాగా ఈ ముగ్గురు కాంగ్రెస్ నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.

దారుణంగా హత్య చేశారు..
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 44వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అయిన మురళీ గత గురువారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనను సాయంత్రం 6.30గంటల సమయంలో సొంత ఇంట్లోనే నిందితులు వేటకొడవళ్లతో దారుణంగా పొడిచి చంపారు.మురళిని 24సార్లు కత్తులతో పొడిచి చంపడం గమనార్హం.

పక్కా ప్లాన్ ప్రకారమే..
పుట్టిన రోజే హత్య చేయాలని పక్కా పథకం ప్రకారం నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారు. హత్య చేసిన అనంతరం నిందితులు తాము హత్యకు ఉపయోగించిన ఆయుధాలను దారిపొడవునా గాల్లో తిప్పుతూ బైకులపై హన్మకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.

ఇబ్బంది పెట్టేందుకే కేసులు
ఇది ఇలా ఉండగా, రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టేందుకే తమ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారని కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్ రెడ్డి, శ్రీమాన్, శేఖర్ అన్నారు. మురళి తమకు మంచి స్నేహితుడని, అతని హత్య తమను కలచివేసిందని అన్నారు. ఆధారాల్లేకుండా తమపై కేసు నమోదు చేయడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications