టీఆర్ఎస్కు షాకిచ్చిన కార్పోరేటర్... మేయర్ ఎన్నిక వేళ అలిగి వెళ్లిపోయిన విజయారెడ్డి...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. మేయర్గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్గా తార్నాక టీఆర్ఎస్ కార్పోరేటర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. మరోవైపు మేయర్ పదవిపై ఆశలు పెట్టుకుని భంగపడ్డ ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అలిగి వెళ్లిపోయారు.
ఖైరతాబాద్ నుంచి రెండోసారి గెలుపొందిన విజయారెడ్డి మేయర్ పదవి కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. పార్టీ అధిష్టానం కూడా ఈసారి తనకే అవకాశం ఇస్తుందని భావించారు. బుధవారం(ఫిబ్రవరి 10) సాయంత్రం విజయారెడ్డికే మేయర్ పదవి దక్కవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో ఆమె ఇంటి వద్ద అనుచరులు హడావుడి చేశారు. కొంతమంది నేతలు సైతం ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో విజయారెడ్డి చాలా హుషారుగా కనిపించారు. బహుశా అధిష్టానం సీల్డ్ కవర్లో తన పేరే పేర్కొని ఉంటుందని ఆమె భావించి ఉండవచ్చు. తెలంగాణ భవన్లో సమావేశం తర్వాత అందరితో పాటే ప్రత్యేక బస్సులో ఆమె జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. కానీ అప్పటికే మేయర్గా గద్వాల విజయలక్ష్మి పేరు ఖరారైనట్లు తెలియడంతో విజయారెడ్డి అలిగి అక్కడినుంచి వెళ్లిపోయారు.
మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే కౌన్సిల్ హాల్ నుంచి ఆమె వెళ్లిపోయారు. టీఆర్ఎస్ నేతలు ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. విజయారెడ్డికి మేయర్ పదవి దక్కకపోవడంతో ఆమె మద్దతుదారులు,పీజేఆర్ అభిమానులు టీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.
కాగా,మేయర్గా ఎన్నికైన విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. డిప్యూటీ మేయర్ శ్రీలత తార్నాక నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే.మేయర్ ఎన్నికకు టీఆర్ఎస్కు ఎంఐఎం సభ్యులు మద్దతు తెలిపారు. జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి ఎన్నిక సమావేశానికి మొత్తం 149 మంది సభ్యులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార సమావేశానికి హాజరైన 149 మంది కార్పొరేటర్లు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు రాజ్య సభ నుండి ఐదుగురికి గాను ముగ్గురు, 15 ఎమ్మెల్సీలకు గాను 10 మంది, 21 ఎమ్మెల్యే లకు గాను 20 మంది సభ్యులు హాజరయ్యారు. ఎక్స్అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ మేయర్ పదవిని దక్కించుకోగలిగింది.